బెంగాల్ ఎన్నికల ప్రచారంలో జైశ్రీరామ్ నినాదాలు... నిషేధం విధించాలని పిటిషన్... కొట్టివేసిన సుప్రీం...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 'జై శ్రీరామ్' నినాదాలను నిషేధించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పిటిషన్లో పేర్కొన్న అంశాలన్నింటినీ తాము చదివామని... ఈ వాదనతో తాము ఏకీభవించలేమని సీజేఐ ఎస్ఏ బోబ్డే నేత్రుత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. బెంగాల్కు చెందిన మనోహర్ లాల్ శర్మ సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయగా... న్యాయస్థానం మంగళవారం(మార్చి 9) విచారణ చేపట్టింది.
ఒక రాజకీయ పార్టీ నిరంతరం జై శ్రీరామ్ నినాదాలను,ఇతర మతపరమైన నినాదాలను ఉపయోగించడం సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని లాల్ శర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి ఎన్నికల ప్రచారంలో ఆ నినాదాలను ఉపయోగించకుండా ఆదేశాలివ్వాలని కోరారు. అంతేకాదు,ఆ నినాదాలు ఉపయోగిస్తున్నవారిపై సీబీఐ చేత ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలివ్వాలని కోరారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఇలాంటి నినాదాలు నేరం కిందకు వస్తాయని పేర్కొన్నారు.
బెంగాల్లో 8 దశల్లో పోలింగ్ నిర్వహించడాన్ని కూడా లాల్ శర్మ సవాల్ చేశారు. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కుకు ఇది భంగం కలిగిస్తోందన్నారు. బెంగాల్తో పాటే ఎన్నికలు నిర్వహిస్తున్న తమిళనాడు,కేరళ,పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒకే దఫాలో ఎన్నికలు పెట్టి... ఒక్క బెంగాల్లో మాత్రం 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. లాల్ శర్మ పిటిషన్ను విచారించిన సీజేఐ ఎస్ఏ బోబ్డే నేత్రుత్వంలోని బెంచ్ దాన్ని కొట్టివేసింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.
బెంగాల్లో మార్చి 27న మొదటి దశ పోలింగ్, ఏప్రిల్ 1న రెండో దశ పోలింగ్, ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్, ఏప్రిల్ 10న నాలుగో దశ పోలింగ్, ఏప్రిల్ 17న ఐదో దశ పోలింగ్, ఏప్రిల్ 22న ఆరో దశ పోలింగ్, ఏప్రిల్ 26న ఏడో దశ పోలింగ్, ఏప్రిల్ 29న చివరి దశ పోలింగ్ జరనున్న సంగతి తెలిసిందే. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇప్పటికే అధికార తృణమూల్ కాంగ్రెస్ 291 మంది అభ్యర్థులతో తమ తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ 57 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. బెంగాల్ గడ్డను బెంగాల్ బిడ్డనే పాలించాలన్న నినాదంతో మమతా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు టీఎంసీ పదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని... ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈసారి బెంగాల్ గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే అన్న ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి బెంగాల్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.