ఈవీ చెన్నయ్య వర్సెస్ ఏపీ: ఎస్సీ, ఎస్టీ ఉపకులాలపై సుప్రీంకోర్టు సంచలనం: రాష్ట్రాలకు స్వేచ్ఛ
న్యూఢిల్లీ: ఎస్సీ ఎస్టీ ఉపకులాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయా కులాల ఉపకులాల కోసం రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనితో- కులాల ఉప వర్గీకరణలో రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించినట్టయింది. ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల నుంచీ ఉద్యమం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు.. దీనికి బాటలు వేసినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీన్ని విస్తృతస్థాయి ధర్మాసనానికి బదలాయించింది.
ఎస్సీ, ఎస్టీల ఉప కులాల వర్గీకరణపై పంజాబ్ నుంచి దాఖలైన ఓ పిటీషన్పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఎస్సీ ఎస్టీ కులాల ఉపవర్గీకరణకు పంజాబ్ చేసిన చట్టాన్ని పంజాబ్ హైకోర్టు కొట్టేసింది. 2004లో ఈవీ చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పంజాబ్ హైకోర్టు దాన్ని కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది పంజాబ్ ప్రభుత్వం. జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ కృష్ణ మురళీలతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్పై విచారణ నిర్వహించింది. అనంతరం కీలక వ్యాఖ్యలను చేసింది. దీనిపై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
ఎస్సీ, ఎస్టీల్లో కులాలవారీగా ఉప వర్గీకరణ చేపట్టాల్సిన పరిస్థితి ఎదురైతే.. ఎక్కడా ప్రాధాన్యత తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రాధాన్యత తగ్గించకుండా కులాల ఉపవర్గీకరణ చట్టం చేసుకోవచ్చని వెల్లడించింది. ఈవీ చెన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసుపై 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాము విభేదిస్తున్నట్లు తాజాగా ధర్మాసనం పేర్కొనడం సంచలనంగా మారింది.
Recommended Video
2004లో ఈవీ చెన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని ధర్మాసనం స్పష్టం చేసింది. 2004లో సరైన నిర్ణయం తీసుకోకుండా అప్పటి ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చినట్లు తాము అభిప్రాయపడుతున్నట్లు అయిదు మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పేర్కొంది.