లైంగిక దాడి: తరుణ్ తేజ్పాల్కు సుప్రీంకోర్టు బెయిల్
పానాజీ: లైంగిక దాడి కేసులో తరుణ్ తేజ్పాల్కు ఊరట లభించింది. లైంగిక దాడి కేసులో నిందితుడైన తెహెల్కా పత్రిక వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్పాల్కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశిస్తూ జస్టిస్ విక్రమ్జిత్, జస్టిస్ ఎస్కె సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
యాభై ఏళ్ల వయస్సు గల తరుణ్ తేజ్పాల్ పాస్పోర్టును కోర్టు స్వాధీనం చేసుకుంది. విచారణకు క్రమం తప్పకుండా ట్రయల్ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. వివిధ సెక్షన్ల కింద గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతనిపై కేసు పెట్టారు.
తరుణ్ తేజ్పాల్ను పోలీసులు నిరుడు నవంబర్ 30వ తేదీన అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన వాస్కోలోని సదా సబ్ జైలులో ఉంటున్నాడు. గోవాలో ఏర్పాటు చేసిన థింక్ ఫాస్ట్ సదస్సు సందర్భంగా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ జూనియర్ ఆయనపై ఆరోపణలు చేసింది.
తనపై నవంబర్ 7,8 తేదీల్లో రెండుసార్లు తరుణ్ తేజ్పాల్ లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. కోర్టులో తేజ్పాల్ తరఫున గత యుపిఎ ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్న సల్మాన్ ఖుర్షీద్ వాదిస్తున్నారు.