రైతాంగ దీక్షలపై సుప్రీంకోర్టు ఆగ్రహం: కీలక ఆదేశాలు జారీ: నోటీసులు: రైతు సంఘాల ఇంప్లీడ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్నారు. దేశ రాజధానిని ముట్టడించారు. అన్ని మార్గాల వద్ద బైఠాయించారు. రోజుల తరబడి వారి దీక్షలు కొనసాగుతోన్నాయి. రైతులెవరూ ఢిల్లీలో అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకోవడంలో భాగంగా అక్కడి పోలీసులు అన్ని మార్గాలను మూసివేశారు. ఫలితంగా రాకపోకలు స్తంభించిపోయాయి. వాహనదారులను తనిఖీ చేసిన తరువాతే.. వారికి అనుమతి ఇస్తున్నారు. బుధవారం నాటికి రైతుల దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి.
అనుకున్నదే: ఏపీ, తెలంగాణ చీఫ్ జస్టిస్ల బదిలీలపై సుప్రీంకోర్టు కొలీజియం అధికారిక ప్రకటన ఇదే
రైతుల దీక్షలు, బైఠాయింపుల వల్ల వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోందని, వారిని వెంటనే అక్కడి నుంచి తొలగించేలా ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్.. బుధవారం ధర్మాసనం సమక్షానికి విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డె సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటీషన్ను విచారించింది. బొబ్డెతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బొపన్న, వీ రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు.
విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలను చేసింది. రైతు సంఘాల ప్రతినిధులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలకు చెందిన రైతుల ప్రతినిధులను ఈ కమిటీలో భాగస్వామ్యులను చేయాలని సూచించింది. వారితో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు, ఇతర స్టేక్ హోల్డర్లను కమిటీలోకి తీసుకోవాలని పేర్కొంది. రైతుల సమస్యలపై చర్చించి, వాటిని పరిష్కరించడానికి అవసరమైన నిర్ణయాలను తీసుకోవాలని ధర్మాసనం సూచించింది.
మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తోన్న రైతుల డిమాండ్లను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించట్లేదని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. అందుకే- ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడింది. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులను జారీ చేసింది. తమ అభిప్రాయాలను వెల్లడించాలని ఆదేశించింది. ఇవే పిటీషన్లపై కొనసాగుతోన్న విచారణలో రైతు సంఘాల ప్రతినిధులు ఇంప్లీడ్ కావడానికి అనుమతి ఇచ్చింది. అనంతరం ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది.