వరవరరావు అరెస్టు పై సుప్రీంకోర్టులో నేడు విచారణ
ఢిల్లీ: భీమా కొరెగావ్ విచారణ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ఐదుమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వారి అరెస్టు అక్రమం అంటూ సుప్రీం కోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో ప్రముఖ చరిత్రకారుడు రోమిలా థాపర్ కూడా ఉన్నారు. వెంటనే వారిని విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ వారు పిటిషన్లో పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో వరవరరావు, గౌతమ్ నవలఖ, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొన్జాల్వేస్లున్నారు. అంతేకాదు స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాల్సిందిగా పిటిషన్లో పేర్కొన్నారు.
విరసం నేత వరవరరావుతో పాటు మరికొందరిని మంగళవారం హైదరాబాద్, ముంబై, ఫరీదాబాద్,న్యూఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీని హత్యచేసేందుకు కుట్రపన్నారంటూ వీరిపై ఆరోపణలున్నాయి. మావోయిస్టులతో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు పోలీసులు. ఈ కుట్రలో మావోయిస్టులకు నిధుల సమీకరణలోనూ వరవరరావు పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పుణె నుంచి హైదరాబాద్కు చేరుకున్న పోలీసులు మంగళవారం తెల్లవారుజామున నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు చేపట్టారు.
వరవరరావు, ఆయన కుమార్తె, ఆయన స్నేహితులు, నాగోల్లోని ఓ రిపోర్టర్ నివాసంలో పోలీసుల సోదాలు జరిపారు. వరవరరావు ఎవరితోనూ సంప్రదింపులు చేయకుండా ఆయన ఫోన్ స్విచ్ఛాప్ చేయించారు.మోడీ హత్య కుట్రకు సంబంధించి గతంలో కేసు నమోదైన అందరి ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు జరిగాయి. అయితే, గతంలో వచ్చిన ఆరోపణలను వరవరరావు అప్పుడే ఖండించారు.వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహించడంపై సామాజిక కార్యకర్త సంధ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలతో సోదాలు నిర్వహించడం సరికాదన్నారు.