ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ల కోసం ఆధార్ లింక్ తప్పనిసరి? నకిలీ వార్తలు, పోర్నోగ్రఫీకి అడ్డుకట్ట
న్యూఢిల్లీ: ఇక సోషల్ మీడియాలో అకౌంట్లను తెరచుకోవాలంటే.. ఆధార్ కార్డు తప్పనిసరి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అగ్రశ్రేణి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఫేస్ బుక్, ట్విట్టర్, యుట్యూబ్, గూగుల్ లల్లో వ్యక్తిగతంగా అకౌంట్ ను ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు నంబర్ ను పొందుపరచాలనే విషయంపై అభిప్రాయాలను వెల్లడించాలని సూచిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాకుండా.. ట్విట్టర్, గూగుల్, యుట్యూబ్ సంస్థల యాజమాన్యానికీ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై అభిప్రాయాలను వెల్లడించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆయా సంస్థలకు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 13వ తేదీకి వాయిదా వేసింది.
ప్రణయ్, అమృత విషాదంత ప్రేమకథను ప్రపంచం చదువుతోంది: వాషింగ్టన్ పోస్ట్ లో ప్రత్యేక కథనం
సోషల్ మీడియా ప్రొఫైళ్లకు ఆధార్ తో లింక్
దీనితో పాటు- దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లో చాలాకాలంగా పెండింగ్ లో ఉంటూ వస్తోన్న సోషల్ మీడియాకు సంబంధించిన పిటీషన్ల విచారణను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఫేస్ బుక్ యాజమాన్యం ఇదివరకే దాఖలు చేసిన పిటీషన్ పైనా జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనూరాధ బోస్ లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటీషన్ పై విచారణ నిర్వహించింది. సోషల్ మీడియా ప్రొఫైళ్లను ఆధార్ కార్డుతో లింక్ చేయాలనే పిటీషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమ, మంగళవారాల్లో వాదనలను ఆలకించింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, ఫేస్ బుక్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగీ తమ వాదనలను వినిపించారు.
నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి ఇదొక్కటే మార్గం..
ఫేస్ బుక్, ట్విట్టర్, యుట్యూబ్, గూగుల్ లల్లో వ్యక్తిగతంగా ఖాతాలను నిర్వహిస్తోన్న వారి ప్రొఫైళ్లను ఆధార్ కార్డుతో లింక్ చేయడం వల్ల నకిలీ వార్తలను అరికట్టవచ్చని కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. సమాజంలో కాస్త పేరున్న వ్యక్తులపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్ట్ చేస్తోన్న సమాచారం, అశ్లీలకరమైన ఫొటోలు, పోర్నోగ్రఫీకి సంబంధిత వీడియోలు, దేశ వ్యతిరేక వ్యాఖ్యానాలను నియంత్రించడానికి ఆయా ప్రొఫైళ్లను ఆధార్ కార్డులో లింక్ చేయడం ఒక్కటే మార్గమని అన్నారు. ప్రత్యేకించి- ఎన్నికల సమయంలో రాజకీయమైన కారణాలతో కొన్ని నకిలీ వార్తలు, పరువు తీసే సమాచారాన్ని ఇష్టానుసారంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ అవుతున్నాయని పేర్కొన్నారు.
ఫేస్ బుక్ పై నమోదైన కేసులు..
దీనితో పాటు- ఫేస్ బుక్ ప్రొఫైళ్లను ఆధార్ కార్డుతో లింక్ చేయాలని కోరుతూ మద్రాస్, బోంబే, మధ్య ప్రదేశ్ హైకోర్టుల్లో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. కాలం గడుస్తున్నప్పటికీ.. ఆ పిటీషన్లు విచారణకు రావట్లేదు. వాటన్నింటినీ సమీకృతం చేసి, సుప్రీంకోర్టు ద్వారా విచారణ చేపట్టాలన్న పిటీషన్ పైనా వాదోపవాదాలను ఆలకించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ పిటీషన్ స్వయంగా ఫేస్ బుక్ యాజమాన్యమే సుప్రీంకోర్టులో దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై వాదనలను విన్న తరువాత ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వంతో పాటు, ట్విట్టర్, యుట్యూబ్, గూగుల్ సంస్థల యాజమాన్యానికి నోటీసులను జారీ చేసింది. ఫేస్ బుక్ దాఖలు చేసిన పిటీషన్ పై అభిప్రాయాలను వెల్లడించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 13వ తేదీకి వాయిదా వేసింది.
వాట్సప్ మినహాయింపు..
ఈ వ్యవహారంలో మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వాట్సప్ ను మినహాయించారు. దీనికి కారణాలు లేకపోలేదు. వాట్సప్ ద్వారా నకిలీ వార్తలను గానీ, ప్రముఖుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు సమాచారాన్ని గానీ లేదా పోర్నోగ్రఫికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను వాట్సప్ ద్వారా పంపించిన వారిని తేలిగ్గా గుర్తించడానికి వీలు ఉంది. ఈ నేపథ్యంలో- ఆధార్ లింకేజీ వ్యవహారం నుంచి వాట్సప్ ను మినహాయించినట్లు చెబుతున్నారు. నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని ఎవరు షేర్ చేస్తున్నారనే విషయాన్ని గుర్తించవచ్చని ఇదివరకు ఐఐటీ ప్రొఫెసర్లు సుప్రీంకోర్టు నివేదించారు. వారిని ఎలా గుర్తించవచ్చో ప్రయోగాత్మకంగా చూపించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాట్సప్ నంబర్ కు ఆధార్ కార్డు లింకేజీ నుంచి మినహాయింపు ఇచ్చారు.