జస్టిస్ దీపక్ మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్కు ఉరిశిక్ష ఖరారు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యక్తిగత భద్రతను కట్టుదిట్టం చేశారు.
అంతేకాదు, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సమకూర్చారు. బెదిరింపు లేఖపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. తన ఉరిశిక్ష ఖరారుపై చివరి క్షణంలో యాకుబ్ మెమన్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్లను సుప్రీంకోర్టులో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.
అంతేకాదు అదేరోజు రాత్రి జరిగిన విచారణలో యాకుబ్ మెమన్కు ఉరి సరైందేనంటూ జస్టిస్ దీపక్ మిశ్రా సంచలన తీర్పు కూడా చెప్పారు. దీంతో జులై 30న ఉదయం మెమన్ను నాగ్పూర్లోని సెంట్రల్ జైల్లో ఉరిశిక్షను అమలు చేశారు. తాజాగా శుక్రవారం ఉదయం గుర్తు తెలియని దుండగుల నుంచి జస్టిస్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చింది.
''మీరు ఎంత భద్రత కల్పించుకున్నా సరే.. మేం మిమ్మల్ని చంపి తీరుతాం'' అని రాసిన లేఖను దీపక్ మిశ్రా ఉంటున్న బంగళా వెనకవైపు గోడపై నుంచి లోపలకు విసిరేశారు. ఈ బెదిరింపు లేఖపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దత్తు కూడా స్పందించారు. "కేసులను సరైన విధంగా పరిష్కరించడమే మా కర్తవ్యం. మా డ్యూటీని ఎలాంటి భయం లేకుండా మేం నిర్వర్తిస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.