సీజేఐ లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు!.. జస్టిస్ బోబ్డే నేతృత్వంలో ధర్మాసనం ఏర్పాటు!
ఢిల్లీ : చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది. సీజేఐ ఆదేశం మేరకు త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. జస్టిస్ బోబ్డే అధ్యక్షతన ఏర్పాటు చేసిన ధర్మాసనం ఒక మహిళా న్యాయమూర్తికి అవకాశం కల్పించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ జస్టిస్ స్వయంగా అంతర్గత విచారణకు ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అఫిడవిట్పై వివరణ ఇవ్వండి!.. సీజేఐ కేసులో లాయర్కు సుప్రీం నోటీసు!
త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు
లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ రంజన్ గొగోయ్ అంతర్గత విచారణకు ఆదేశించారు. తాజా పరిమాణాలు, ధర్మాసనం ఏర్పాటుపై చర్చించేందుకు సమావేశమైన సుప్రీం జడ్జిలు ముగ్గురు సభ్యులతో విచారణ జరపాలని నిర్ణయించారు. చీఫ్ జస్టిస్ తర్వాత సుప్రీంలో సీనియర్ అయిన జస్టిస్ ఎస్ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సీజేఐ కేసును విచారిస్తుందని నిర్ణయించారు. బోబ్డే తర్వాత సీనియర్ అయిన జస్టిస్ ఎన్వీ రమణతో పాటు మహిళా జడ్జి అయిన జస్టిస్ ఇందిరా బెనర్జీలను ధర్మాసనంలో సభ్యులుగా ఉంటారు.
సీజేఐ తీరుపై విమర్శలు
తనపై వచ్చిన ఆరోపణలపై తన అధ్యక్షతన ఏర్పాటైన ధర్మాసనం విచారణ జరపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీజేఐ తీరును రెండు సుప్రీంకోర్టు న్యాయవాద సంఘాలు తప్పుబట్టాయి. దీంతో ఈ కేసును జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ రోహింగ్టన్ ఫాలి నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం మంగళవారం సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రానికి జస్టిస్ బోబ్డే నేతృత్వంలో సీజేఐ అంతర్గత విచారణకు ఆదేశించడం విశేషం.
అఫిడవిట్పై వివరణ
కేసును సుమోటోగా స్వీకరించిన ధర్మాసనానికి లాయర్ ఉత్సవ్ సింగ్ బైన్స్ సమర్పించిన అఫిడవిట్పై ఇవాళ విచారణ జరగనుంది. వివరణ ఇచ్చేందుకు అడ్వకొట్ ఉత్సవ్ ధర్మాసనం ఎదుట హాజరుకానున్నారు. తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించనున్నారు.