సుప్రీం వివాదం: అభిప్రాయ భేదాలు సమసిపోతాయి, రాజకీయాలొద్దు: బార్ కౌన్సిల్ ఛైర్మన్
సుప్రీంకోర్టు జడ్జీల మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలు సమసిపోతాయని, ఈ అంశం అంతర్గతంగానే పరిష్కారమవుతుందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీల మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలు సమసిపోతాయని, ఈ అంశం అంతర్గతంగానే పరిష్కారమవుతుందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు.
సుప్రీం వివాదం: రంగంలోకి బార్ అసోసియేషన్, అత్యవసర సమావేశం, కీలక తీర్మానాలు
సుప్రీం కోర్టులోనూ మహిళల పట్ల వివక్ష! 67 ఏళ్లలో ఆరుగురే మహిళా న్యాయమూర్తులు!
శుక్రవారం జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసఫ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ రంజన్ గొగోయ్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీజేఐ దీపక్ మిశ్రాపైనా, సుప్రీంకోర్టు పాలనా విధానాలపైనా ఆరోపణలు చేసిన ఒకరోజు తరువాత బార్ కాన్సిల్ ఆఫ్ ఇండియా మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చింది.
దీనిపై శనివారం సమావేశమైన బార్ కౌన్సిల్ సభ్యులు అనంతరం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా, మనన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలు లేవనెత్తిన అంశాన్ని వివాద కోణం నుంచి ఎంతమాత్రం చూడవద్దని కోరారు.
'సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటనలు'.. ఏమిటవి? సీజేఐ జోక్యం మితిమీరుతోందా?
ఈ విభేదాలు అంతర్గతంగానే పరిష్కారమవుతాయని చెప్పారు. బార్ కౌన్సిల్ నుంచి ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులను కలుసుకుని వారి అభిప్రాయాలను వినాలని కౌన్సిల్ నిర్ణయించినట్టు చెప్పారు. సాధ్యమైనంత త్వరలో ఈ అంశాన్ని పరిష్కరించాలని కౌన్సిల్ కోరుకుంటోందన్నారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు లేవనెత్తిన అంశం న్యాయవ్యవస్థ అంతర్గత వ్యవహారమని, దానిలో జోక్యం చేసుకోమని ప్రధాని, న్యాయశాఖ మంత్రి చెప్పడాన్ని మిశ్రా స్వాగతించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నామని అన్నారు.
'న్యాయ వ్యవస్థపై మాట్లాడే అవకాశాన్ని రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ పార్టీలకు కల్పించింది మనమే. ఆయనకు (రాహుల్), ఇతర రాజకీయ పార్టీలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంశాన్ని దయచేసి రాజకీయం చేయవద్దు..' అని మనన్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు.
అదే విధంగా మరోసారి మీడియా ముందుకు వెళ్లవద్దని సుప్రీం న్యాయమూర్తులను కూడా ఆయన కోరారు. న్యాయమూర్తులు ప్రజలముందుకు వెళ్లి ఉండాల్సింది కాదని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అభిప్రాయపడ్డారు.
ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు దాన్ని పరిష్కరించుకునేందుకు తగిన యంత్రాంగం న్యాయవ్యవస్థ పరిధిలోనే ఉందని, ఆ స్ఫూర్తితో చర్చించుకుని పరిష్కరించుకోవాలని మనన్ కుమార్ మిశ్రా సూచించారు. మరోసారి ఇలాంటి వాటికి అవకాశమివ్వ వద్దని కౌన్సిల్ తరఫున మనన్ కుమార్ మిశ్రా విజ్ఞప్తి చేశారు.