17 కాదు 16..40తో ముగింపు: రామజన్మభూమిపై సుప్రీంకోర్టులో తుది విచారణ కాస్సేపట్లో: ఇక వాదనలు ఉండవ్..!
న్యూఢిల్లీ: దశాబ్దాల తరబడి న్యాయస్థానాల్లో నానుతూ వస్తోన్న అత్యంత సున్నితమైన, కోట్లాదిమంది హిందువులు, ముస్లిం సోదరుల మనోభావాలతో ముడిపడి ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించిన విచారణ తుది దశకు చేరుకుంది. అయోధ్యలో 2.72 ఎకరాల స్థలం ఎవరికి చెందాలనే విషయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం మరి కొన్ని గంటల్లో తన తుది విచారణను చేపట్టబోతోంది. బుధవారం చేపట్టే విచారణతో చివరిది. ఇకపై ఈ అంశంపై వాదోపవాదాలు ఉండబోవు. ఇక ఏకంగా తీర్పే వెలువడుతుంది. తుది విచారణ ముగిసిన అనంతరం తీర్పును వెలువరించే తేదీ వెలువడే అవకాశం ఉంది.
ఇవిగో రుజువులు: బాబ్రీ మసీదు కింద ఆలయం ఉండేదన్న లాయరు
ఒక రోజు ముందుకు.. ఎందుకు?
నిజానికి అయోధ్య భూ వివాదంపై గురువారం నాడు తుది విచారణను చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఇదివరకే వెల్లడించారు. దీనికి అనుగుణంగా వాదనల షెడ్యూల్ ను నిర్ధారించారు. కొన్ని కారణాల వల్ల ఈ గడువును ఒకరోజు ముందుకు జరిపారు. గురువారానికి బదులుగా బుధవారం నాడే తుది విచారణను నిర్వహించబోతున్నట్లు రంజన్ గొగొయ్ స్పష్టం చేశారు. రంజన్ గొగొయ్ నేతృత్వంలో న్యాయమూర్తులు ఎస్ ఏ బొబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ ఏ నజీర్ లతో కూడిన అయిదు మంది జడ్జిల ధర్మాసనం అయోధ్య వివాదంపై వాదోపవాదాలను ఆలకిస్తోంది.
39 సార్లు విచారణలు.. సాయంత్రం 5 గంటల వరకు
మంగళవారం నిర్వహించిన విచారణతో కలుపుకొని ఇప్పటిదాకా సుప్రీంకోర్టు అయోధ్య భూ వివాదంపై 39 సార్లు విచారణను నిర్వహించింది. బుధవారం నాడు చేపట్టే విచారణ ఈ సంఖ్య 40కి చేరుకుంటుంది. అక్కడితో వాదనల పర్వానికి తెర పడనుంది. విచారణలకు చివరిరోజు కావడంతో సాయంత్రం 5 గంటల వరకూ సుప్రీంకోర్టు కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఇప్పటిదాకా రామ్ లల్లా విరాజమాన్, నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్ బోర్డు సహా పలు ధార్మిక సంఘాలు దాఖలు చేసిన పిటీషన్లను విచారించింది. వారి వాదనలను ఆలకించంది. ప్రతి చిన్న విషయాన్నీ రికార్డు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
6000 పేజీల అలహాబాద్ హైకోర్టు తీర్పు..
2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలు హిందూ ధార్మిక సంఘాలు, ముస్లిం సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. 2.77 ఎకరాల స్థలాన్ని రామ్లల్లా విరాజమాన్, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్బోర్డులకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ 2011లో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ మిళితం చేసి విచారణను కొనసాగిస్తోంది సుప్రీంకోర్టు. ఇక అప్పటి నుంచి కోర్టులోనే కేసు మగ్గుతూ వస్తోంది.
శ్రీరాముడి జన్మస్థలంలోనే రామమందిరం..
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో చారిత్రాత్మక బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలంలోనే శ్రీరామచంద్రుడి ఆలయాన్ని నిర్మించాలంటూ హైందవ సంఘాలు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్థలం తమకు దక్కుతుందటే.. తమకు దక్కుతుందంటూ రామ జన్మభూమి న్యాస్, బాబ్రీ మసీదు కమిటీ సుప్రీంకోర్టులో కేసు వేశాయి. సంవత్సరాల నుంచీ ఈ కేసు న్యాయస్థానాలో నానుతూ వస్తోంది. ఇదివరకు అలహాబాద్ హైకోర్టు బెంచ్, ఉత్తర్ ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు రెండు కమిటీల ప్రతినిధులు.