కౌన్సెలింగ్కి ఓకే, కానీ: హైకోర్టు హెచ్చరికకు జుడాలు నో
న్యూఢిల్లీ/హైదరాబాద్: రెండో దశ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు అనుమతిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. నవంబర్ 15వ తేదీ నుండి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని కళాశాలలను సుప్రీం కోర్టు ఆదేశించింది. 2013-14లోని తెలంగాణకు చెందిన అనుబంధ కళాశాలలకే కౌన్సెలింగ్ వర్తిస్తుందని కోర్టు పేర్కొంది.
కాగా, స్లైడింగుకు ఏ మాత్రం అవకాశం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. రెండు రోజుల కిందటే కౌన్సెలింగ్కు అంగీకారం తెలిపిన సుప్రీం కోర్టు.. నవంబర్ 14లోపు కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. 2013-2014 అనుబంధ కళాశాలలకే వర్తిస్తుందని కోర్టు తెలిపింది. తెలంగాణలోని కళాశాలలకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది.
సెకండ్ సెమిస్టర్ ఫిబ్రవరి 10వ తేదీన కచ్చితంగా ప్రారంభం కావాలని ఉత్తర్వులో పేర్కొంది. ఇది తెలంగాణలోని 174 కళాశాలలకు వర్తిస్తుందని తెలిపింది. ఇంతవరకు అడ్మిషన్లు పొందని విద్యార్థులకే కౌన్సెలింగ్ జరపాలని తెలిపింది. వేరే కళాశాలల్లో చేరిన విద్యార్థులు రెండోసారి కౌన్సెలింగ్కు అనర్హులు అని తెలిపింది.
జుడాల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం
తెలంగాణలోని జనియర్ డాక్టర్ల సమ్మె పైన హైకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం సమ్మె విరమించాలని ఆదేశాలు జారీ చేసింది. వైద్యులు సమ్మె విరమిస్తేనే కేసు విచారిస్తామని స్పష్టం చేసింది. ఆదేశాలు పాటించకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధమేనా అని హైకోర్టు ప్రశ్నించారు. అరగంటలోగా సమ్మె విరమిస్తారో లేదో చెప్పాలని డెడ్లైన్ విధించింది. అయితే, హైకోర్టు ఆదేశాలను జుడాలు తిరస్కరించారు. సమ్మె విరమించేంది లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జుడాల పైన కేసు విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
కాగా, పలు డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇందిరాపార్క్ వద్ద జుడాలు నిరాహార దీక్ష కూడా చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపించేంత వరకు తాము ఆందోళనను విరమించేది లేదని జుడా పలుమార్లు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పలుమార్లు జుడాలను హెచ్చరించారు. జుడాలు ఆందోళన విరమించాలని, వైద్యులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. హైకోర్టు కూడా రెండు రోజుల క్రితం సమ్మె పైన మండిపడింది.