శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
Recommended Video
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఐదుగురు జడ్జిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. శబరిమలలో మహిళల ప్రవేశానికి పచ్చ జెండా ఊపారు. శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశంపై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పును చదివారు.
చదవండి: శబరిమల ఆలయం కేసు పూర్వాపరాలు
చట్టాలు, సమాజా అందరినీ గౌరవించాలని పేర్కొన్నారు. దైవత్వం లింగ విబేధాలు చూపించదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అన్ని వయస్సుల మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లవచ్చునని చెప్పారు. భారత దేశంలో మహిళలను దేవతలతో కొలుస్తారని, అలాంటప్పుడు లింగ బేధం చూపలేమని అన్నారు. మహిళను తక్కువగా చేసి చూడలేమని పేర్కొన్నారు.
మతం అనేది ప్రాథమిక జీవన విధానంలో భాగమని చెప్పారు. మతం విషయంలో మహిళలకు సమాన హక్కులు ఉండాల్సిందే అన్నారు. శారీరకమైన మార్పులను సాకుగా చూపి మహిళలపై వివక్ష చూపించడం సరికాదన్నారు.
మహిళలను శబరిమల ఆలయంలోకి ప్రవేశించడాన్ని నిరాకరించడం ద్వారా ఈ ఆలయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 25ను ఉల్లంఘించినట్లేనని అభిప్రాయపడ్డారు. ఐదుగురు జడ్జిల న్యాయస్థానం దీనిని విచారించింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నలుగురు జడ్జిలు సమర్థించగా, మరో జడ్జి ఇందూ మల్హోత్రా మిగతా జడ్జిలతో విబేధించారు.
ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు ఈ తీర్పుతో అంగీకరించగా, ఏకైక మహిళా జడ్జి జస్టిస్ ఇందూ మల్హోత్రా భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. సతీసహగమనం లాంటి సామాజిక రుగ్మతలు మినహా మతపరమైన విధానాలను తొలగించే దానిపై నిర్ణయించే తీసుకునే అంశం కోర్టుకు సంబంధించినది కాదన్నారు. దేశంలో లౌకిక వాతావరణాన్ని కల్పించేందుకు బలంగా నాటుకుపోయి ఉన్న మతపరమైన ఆచారాల్లో మార్పు చేయొద్దన్నారు.
అంతకుముందు దీనిపై ట్రావెన్ కోర్ బోర్డ్ దేవస్థానం తమ వాదనలు వినిపిస్తూ... ఆలయంలోకి మహిళలను అనుమతించడమే ఇటీవలి కేరళ వరదలకు కారణమని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. వరదల కారణంగా రూ.100 కోట్లు దేవస్థానానికి నష్టం వచ్చిందని చెప్పారు. తీర్పు అనంతరం దేవస్థానం బోర్డు స్పందిస్తూ... తాము సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ తీర్పుపై తాము రివ్యూ పిటిషన్ వేయబోమని చెప్పారు.