ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసుల సత్వర విచారణకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసుల విచారణకు కార్యాచారణ ప్రణాళిక సిద్ధం చేసి వారం రోజుల్లో పంపాలని అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఆదేశించింది.
జిల్లాల్లో పెండింగ్ కేసులు, ప్రత్యేక కోర్టులను పరిగణలోకి తీసుకోవాలని, ఆ మేరకు ప్రణాళిక రూపొందించాలని సూచించింది. విచారణ సమయం, కోర్టుల మధ్య దూరం, మౌలిక వసతులు కూడా చూడాలని ఆదేశించింది. ఈ కేసులను ప్రత్యేక కోర్టులకు పంపాలా వద్దా? అనేదానిపై ప్రధాన న్యాయమూర్తులు నిర్ణయం తీసుకోవాలని, అన్ని కేసుల పర్యవేక్షణకు హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
స్టే ఉన్న కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని, స్టే అవసరమైన కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టి 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేగాక, కరోనా కారణంగా విచారణ వాయిదా వేయకూడదని తేల్చి చెప్పింది.
వీడియో కాన్ఫరెన్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విచారణ కొనసాగించాలని సూచించింది. 9 అంశాలను యాక్షన్ ప్లాన్లో చేర్చాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.