నేడే బలపరీక్ష: ప్రొటెం స్పీకర్ వివాదం, ఎమ్మెల్యేల ప్రమాణం, ఉత్కంఠ రేపుతున్న పరిణామాలు
బెంగళూరు: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలో మరోసారి వేడెక్కాయి. శనివారం సాయంత్రం యడ్యూరప్ప ప్రభుత్వం బలం నిరూపించుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో రాజకీయ పార్టీలు మ్యాజిక్ ఫిగర్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
బీజేపీ ప్రలోభాలు: మొబైల్ యాప్తో చెక్ పెడుతోన్న కాంగ్రెస్
ఓ వైపు బీజేపీ తమకు 120మంది సభ్యుల మద్దతు ఉందని ప్రకటిస్తుండగా, కాంగ్రెస్, జేడీఎస్లు మాత్రం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి.
తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
బలపరీక్షకు గవర్నర్ పదిహేను రోజుల సమయం ఇవ్వగా శనివారం సాయంత్రమే ఆ ప్రక్రియ చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనీసం వారం రోజులైనా సమయం దక్కుతుందని, ఈ వ్యవధిలో తగినంత సంఖ్యాబలాన్ని సమకూర్చుకోవచ్చనుకున్న బీజేపీకి ఈ నిర్ణయం మింగుడుపడలేదు. అయినా తాము బలనిరూపణకు సిద్ధమనేనని బీజేపీ నేతలు ప్రకటించడం గమనార్హం.
గోడ దూకెయ్, బయటే కారుంది: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి బీజేపీ ఫోన్, అందుకే హైదరాబాద్కు మకాం
సుప్రీంకోర్టుకు.. ప్రొటెం స్పీకర్ వివాదం
బలపరీక్షలో స్పీకర్ పాత్ర కీలకమయిన నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ నియామకం కూడా వివాదాస్పదమయింది. అత్యంత సీనియర్ శాసనసభ్యులను కాదని యడ్యూరప్పకు విశ్వాసపాత్రుడిగా పేరున్న, జూనియర్ అయిన కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్గా నిర్ణయించడంతో మరో దుమారానికి తెరలేచింది. గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా కాంగ్రెస్, జేడీ(ఎస్)లు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. శనివారం సాయంత్రం నాలుగుకు బలపరీక్ష నిర్వహించనుండగా ఉదయం 10.30కే ప్రొటెం స్పీకర్ అంశంపై కోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు కీలకంగా మారనుంది.
సీక్రెట్ కాదు, ఓపెన్ బ్యాలెట్టే: తేల్చేసిన సుప్రీం, బీజేపీ వాదనపై నవ్వేసిన ధర్మాసనం
ప్రలోభాలకు గురిచేస్తోదంటూ..
మరోవైపు బీజేపీ నుంచి కాంగ్రెస్, జేడీ(ఎస్) శాసనసభ్యులకు గాలం వేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రమయిన నేపథ్యంలో తమ సభ్యులు గీత దాటకుండా కాపాడుకునేందుకు ఆ రెండు పార్టీలు శిబిరాన్ని హైదరాబాద్కు మార్చాయి. తొలుత శాసనసభ్యులను కేరళకు తరలించాలనుకున్నా ప్రత్యేక విమానాలకు పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) నుంచి అనుమతి రాకపోవడంతో అప్పటికప్పుడు నిర్ణయం మార్చుకుని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు తరలించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతల పర్యవేక్షణలో తాజ్కృష్ణ, నోవాటెల్ హోటళ్ళకు చేరవేశారు.
హైదరాబాద్కు వచ్చి వెంటనే బెంగళూరుకు..
కాంగ్రెస్ నేత, కర్ణాటక తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, జేడీ(ఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు కె.సి.వేణుగోపాల్ హుటాహుటిన హైదరాబాద్కు వచ్చారు. వీరంతా తమ పార్టీల శాసనసభ్యులతో సమావేశమై శనివారం బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కుమారస్వామి కూడా సమావేశమయ్యారు. వ్యూహంపై చర్చించుకున్నాక తిరుగుప్రయాణంపైనా కసరత్తు చేశారు. విమానాల్లో వెళ్తే బెంగళూరుకు కాకుండా వేరే నగరాలకు మళ్లించే అవకాశం ఉన్నందున రోడ్డు మార్గంలోనే వాహనాల్లో బయలుదేరారు.
100శాతం నిరూపించుకుంటాం: యడ్యూరప్ప
కాగా, విశ్వాస పరీక్షలో గెలుస్తామని కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. నూటికి నూరుపాళ్లు విశ్వాస పరీక్షలో నెగ్గి తీరుతామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప చెప్పారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టం చేశారు.
తొలి సమావేశం.. ప్రమాణ స్వీకారం
శనివారం ఉదయం 11 గంటలకు 15వ శాసనసభ తొలి సమావేశం ప్రారంభం కానుంది. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్.. శాసనసభ్యులతో ప్రమాణం చేయిస్తారు. సాయంత్రం 4కు బలపరీక్ష నిర్వహిస్తారు. రహస్య ఓటింగ్ చేపట్టాలన్న వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించినందున సభ్యుల వారీగా ప్రభుత్వానికి అనుకూలురు, వ్యతిరేకులను లెక్కిస్తారు. దరిమిలా యడ్యూరప్ప బల పరీక్షలో నెగ్గారో లేదో వెల్లడించటంతో బలనిరూపణలో ఎవరు నెగ్గారనే విషయం తేలిపోతుంది. దీంతో గెలిచిన పార్టీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది.