కర్ణాటకకు షాక్: 6 వేల క్యూసెక్కుల నీరు వదలండి
న్యూఢిల్లీ: కావేరీ జలాల పంపణి విషయంలో కర్ణాటకకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సెప్టెంబర్ 27వ తేదీ వరకు ప్రతి రోజు 6,000 క్యూసెక్కుల కావేరీ నీరు విడుదల చెయ్యాలని కర్ణాటకకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మంగళవారం సుప్రీం కోర్టులోని ద్విసభ్య బెంచ్ కావేరీ జలాల పంపిణి విషయం కేసు విచారణ చేసింది. తమిళనాడుకు ఇప్పట్లో కావేరీ నీరు విడుదల చెయ్యడం వీలుకాదని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది ఎస్. నారిమన్ సుప్రీం కోర్టుకు చెప్పారు.
కేఆర్ఎస్ డ్యాంలో నీరు లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కర్ణాటకలో వర్షాలు పడటం లేదని, అక్కడి ప్రజలు తాగునీరు అందక అవస్థలు పడుతున్నారని చెప్పారు. కర్ణాటక వాదనను తమిళనాడు న్యాయవాదులు వ్యతిరేకించారు.
కావేరీ నీరు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టులో మనవి చేశారు. కర్ణాటక, తమిళనాడు వాదనలు విన్న సుప్రీం కోర్టు సెప్టెంబర్ 27వ తేది వరకు తమిళనాడుకు 6,000 క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు విచారణ సెప్టెంబర్ 27వ తేదికి వాయిదా వేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం సైతం మద్యం దుకాణాలు తియ్యరాదని, నియమాలు ఉల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యగా బెంగళూరు నగరంలో 15 వేల మంది పోలీసులతో పాటు మిలటరీ బలగాలతో భద్రత కల్పిస్తున్నారు.