నేను వస్తా.. జమ్మూలో పర్యటించి నివేదిక ఇవ్వండి: ఆజాద్తో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
ఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఇంకా ఆంక్షలు ఉన్నాయి. దీనిపై పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ విచారణ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారణ చేసింది. జమ్ము కశ్మీర్కు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. నాలుగు జిల్లాలు అయిన బారాముల్లా, శ్రీనగర్, అనంత్నాగ్, జమ్మూలలో పర్యటించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.
గులాంనబీ ఆజాద్ నాలుగు జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం కోరింది. అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సంక్షేమంపై నివేదిక ఇవ్వాలని జస్టిస్ రంజన్ గొగోయ్ గులాంనబీ ఆజాద్ను ఆదేశించారు. అంతేకాదు అక్కడ ఎలాంటి రాజకీయ సభలు కానీ రాజకీయపరమైన అంశాలు కానీ మాట్లాడరాదని ఆదేశించారు. అవసరమైతే తాను కూడా శ్రీనగర్లో స్వయంగా పర్యటిస్తానని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. హైకోర్టులో తమ ఆవేదనను తమ గోడును చెప్పేందుకు ప్రజలకు అనుమతి లేకపోవడాన్ని చాలా సీరియస్గా పరిగణించారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్.
ఆగష్టు 5న జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఇక అప్పటి నుంచి జమ్మూకశ్మీర్ రాష్ట్రం ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయింది. ఆ రాష్ట్రంలో కేంద్ర బలగాలు మోహరించాయి. ఫోన్ కనెక్షన్లు, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కొన్ని చెదురుముదురు ఘటనలు తప్ప అక్కడ పెద్దగా అల్లర్లు కూడా జరిగిందేమీ లేదు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడికి పలువురు రాజకీయ నాయకులు వెళ్లారు. అయితే వారిని నిర్బంధించి తిరిగి ఢిల్లీకి పంపింది కేంద్ర ప్రభుత్వం.