గుడ్ న్యూస్: శబరిమలై ఆలయంలోకి మహిళలు కూడా ప్రవేశించొచ్చన్న సుప్రీంకోర్టు
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలై అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలను కూడా అనుమతించాలంటూ సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు కేవలం పురుషులకు మాత్రమే శబరిమలై ఆలయంలోకి ప్రవేశం ఉండేది. ఆలయం అనేది ప్రజలకోసం ఏర్పాటు చేసినదని... అలాంటప్పుడు కేవలం పురుషులనే అనుమతించి స్త్రీలకు అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలా చేయడమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనంటూ వ్యాఖ్యానించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ రోహిన్టన్ ఫాలి నారిమన్, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్ సింగ్, ఇందు మల్హోత్రలతో కూడిన ధర్మాసనం కేవలం మహిళలు అయినందువల్లే వారికి ఆలయంలోకి అనుమతి లేదా లేక ఇతరత్ర కారణాలేమైనా ఉన్నాయా అంటూ విచారణ చేసింది. గత 800 ఏళ్లుగా ఉన్న సంప్రదాయం ఇకపై మారనుంది అని పిటిషన్ దాఖలు చేసిన ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.
మహిళలకు అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశం కల్పించేలా కేరళ ప్రభుత్వం, ట్రావన్కోర్ దేవస్వామి బోర్డు, శబరిమలై ప్రధాన అర్చకులు, జిల్లా కలెక్టరుకు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ కోరారు. రాజ్యాంగంలోని 14వ అధికరణం సమానత్వం గురించి చెబుతుండగా... 15వ అధికరణం ఒకరిని తన మతం,కులం, జాతి,లింగ బేధం ఆధారంగా వేరుచేయకూడదని చెబుతోంది. మరోవైపు అధికరణం 17 అంటరానితనాన్ని పారద్రోలాలని చెబుతోంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం మహిళలు కూడా శబరిమలై అయ్యప్పస్వామి వారి ఆలయంలోకి ప్రవేశించొచ్చు అని తెలిపింది.