స్వలింగ సంపర్కం నేరమా.. కాదా ? సెక్షన్ 377 రాజ్యంగ బద్ధతపై సుప్రీం పున: పరిశీలన!
న్యూఢిల్లీ: భారత శిక్షాస్మృతి 377వ సెక్షన్ ప్రకారం స్వలింగ సంపర్కం(హోమో సెక్స్) నేరం. అయితే స్వలింగ సంపర్కులను సమర్థించే విధంగా సోమవారం ఓ తీర్పులో సుప్రీంకోర్టు స్పందించింది. సెక్షన్ 377కు ఉన్న రాజ్యాంగ బద్ధతను పునర్ పరిశీలిస్తామని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
దీన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం సెక్షన్ 377 రాజ్యాంగ బద్దతను పరిశీలిస్తుందని కోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 377పై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఎల్జీబీటీ హక్కులను కాపాడాలంటూ అయిదుగురు సభ్యుల వేసిన కేసు సోమవారం సుప్రీంకోర్టు ముందుకు రాగా, కేసు విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది.
పోలీసులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, దీంతో భయం వేస్తోందని ఎల్జీబీటీ సభ్యులు తమ పిటీషన్లో ఆరోపించారు. 2013లో సుప్రీంకోర్టుకు చెందిన ద్విసభ్య ధర్మాసనం కూడా హోమోసెక్స్ను నేరంగా పరిగణిస్తూ తీర్పును ఇచ్చింది. ఆ తీర్పులో సెక్షన్ 377ను ద్విసభ్య ధర్మాసనం నేరంగా గుర్తించింది.
అయితే సోమవారం సుప్రీం ఇచ్చిన తీర్పును ఎల్జీబీటీ సభ్యులు స్వాగతించారు. 'భారతీయ న్యాయవ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది.. మనం 21వ శతాబ్ధంలో జీవిస్తున్నాం.. రాజకీయవేత్తలు, రాజకీయ పార్టీలు మాకు మద్దతు ఇవ్వాలి..' అని కొందరు ఎల్జీబీటీ సభ్యులు కోరారు.