సోమ్నాథ్ భారతికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతికి సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ను సోమవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలంటూ సూచించింది.
గృహ హింస, హత్యాయత్నం ఆరోపణలతో సోమ్నాథ్ భారతిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమ్నాథ్ భారతి తనను మానసికంగా హింసించాడంటూ ఆయన భార్య లిపిక గృహ హింస, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
సోమ్ నాథ్ భారతిపై కేసు నమోదైన తర్వాత, పోలీసులకు చిక్కకుండా ఆయన తప్పించుకు తిరిగారు. ఈ క్రమంలో, వెంటనే లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాతనే, ఆయన ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే, బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
అంతక ముందు సోమ్నాథ్ భారతికి ఢిల్లీలోని కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది. సోమనాథ్ భారతి వద్ద నుంచి ఆయుధాన్ని, ఆయన భార్యకు సంబంధించిన నగలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు కోర్టుకు వివరించారు.
కొన్నాళ్లు ఆజ్ఞాతంలో ఉన్న సోమనాథ్ భారతి పైన ఐపీసీ సెక్షన్ 212(తప్పించుకు తిరగడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ సమయంలో సోమనాథ్ భారతికి ఆశ్రయం ఇచ్చినా ఐదుగురి పైన కూడా కేసులు నమోదు అయ్యాయన్నారు.
ఇన్ని రోజులు ఎక్కడెక్కడకు వెళ్లారో, ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారో అనే వివరాలను పోలీసులు సేకరించారు. ఆశ్రయం పొందిన ప్రాంతాల్లో విచారించనున్నారు. కాగా రెండు రోజుల పోలీసులు కస్టడీలో భార్య లిపిక ఎదుట నలభై నిమిషాలు ప్రశ్నించారు.