వినియోగదారులకు బెదిరింపులా?: మొబైల్, బ్యాంకులపై సుప్రీం ఆగ్రహం
ఆధార్ అనుసంధానం విషయంలో వినియోగదారులపై బెదిరింపులకు గురిచేస్తూ ఒత్తిడి చేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: ఆధార్ అనుసంధానం విషయంలో వినియోగదారులపై బెదిరింపులకు గురిచేస్తూ ఒత్తిడి చేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధార్ నెంబర్లను తమ ఖాతాలు, మొబైల్ నెంబర్లతో అనుసంధానం చేసుకోకుంటే అకౌంట్లు నిలిపివేస్తామని బ్యాంకులు, మొబైల్ కంపెనీలు వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపుతూ ఒత్తిడి పెంచడమేంటని ప్రశ్నించింది.
మొబైల్తో ఆధార్ లింకింగ్: గడువు తేదీపై కోర్టుకు తేల్చేసిన కేంద్రం
ఆధార్ అనుసంధానం విషయంలో ప్రజలను ఆందోళనకు గురిచేయవద్దని సుప్రీంకోర్టు బ్యాంకులు, మొబైల్ ఆపరేటర్లకు సూచించింది. ఆధార్ చట్టం చెల్లుబాటు, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ నెంబర్లతో ఆధార్ అనుసంధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారిస్తూ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
అంతేగాక, ఈ పిటిషన్లపై బదులివ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నవంబర్ నెలాఖరులో ఆధార్ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఎదుట తుది విచారణ జరుగుతుందని జస్టిస్ ఏకే సిక్రీ, అశోక్ భూషణ్లతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.
బ్యాంకులు, మొబైల్ కంపెనీలు ఆధార్తో లింకేజ్ కోసం తుదిగడువుగా డిసెంబర్ 31, ఫిబ్రవరి 6గా ఎస్ఎంఎస్ల్లో ప్రస్తావించాలని సూచించింది. ఆధార్ లింకేజ్కు సంబంధించి తనకూ మెసేజ్లు వచ్చాయని ఈ సందర్భంగా జస్టిస్ సిక్రీ చెప్పడం గమనార్హం. అయితే, మొబైల్ ఫోన్లు, బ్యాంకులకు ఆధార్ అనుసంధానంపై స్టేకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు.