సీక్రెట్ బ్యాలెట్ నుంచి ఫ్లోర్ టెస్టు వరకు: యెడ్డీకి వరుసగా షాకులిచ్చిన సుప్రీం కోర్టు
బెంగళూరు: ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లోర్ టెస్టు ఎదుర్కోనున్నారు. అయన అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టులో వాదనల సమయంలో రేపే ఫ్లోర్ టెస్టుకు మీరు సిద్ధమా అని అడిగితే, కాంగ్రెస్ సిద్ధమని ప్రకటించింది. బీజేపీ మాత్రం వారం రోజుల సమయం అడిగింది.
కర్ణాటక డ్రామా: రేపు సా.4 గంటలకు ఫ్లోర్ టెస్ట్, యెడ్డీ బలం తేలిపోనుంది
అయితే ఆ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఎమ్మెల్యేల బలం ఉంటే శనివారం సాయంత్రం నాలుగు గంటలకు బలం నిరూపించుకోవాలని సూచించింది. ఫ్లోర్ టెస్టుకు సెక్యూరిటీని పర్యవేక్షిస్తామని తెలిపింది. ఈ మేరకు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. సరైన భధ్రత కల్పించాలని పేర్కొంది.
అంతేకాదు, సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని బీజేపీ ముకుల్ రోహత్గీ కోరారు. దానిని కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది. మరోవైపు, యడ్యూరప్ప ఫ్లోర్ టెస్టులో నెగ్గే వరకు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంగ్లో ఇండియన్ నియామకాన్ని కూడా నిలిపివేసింది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలన్న బీజేపీ విజ్ఞప్తిని కూడా తిరస్కరించింది.
ఫ్లోర్ టెస్టుతో కర్ణాటకలో రాజకీయ డ్రామాకు శనివారం తెరపడనుంది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్-జేడీఎస్ వేసిన పిటిషన్పై సుప్రీం శుక్రవారం విచారించింది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలంటే రేపే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. భద్రతా కారణాల రీత్యా ఎమ్మెల్యేలు హాజరుకాని పక్షంలో డీజీపీకి తాము ఆదేశాలిస్తామని పేర్కొంది. శాసనసభలో ఎవరు బలాన్ని నిరూపించుకుంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్పై ఈ ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభించిన సుప్రీం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ యడ్యూరప్ప గవర్నర్ను కోరిన లేఖలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో బీజేపీ తరఫున వాదిస్తున్న ముకుల్ రోహత్గి ఆ లేఖలను కోర్టుకు ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ తమకు ఉందని, బలపరీక్షలో దీన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కాంగ్రెస్-జేడీఎస్కు చెందిన ఎమ్మెల్యేల నుంచి తమకు మద్దతు వస్తుందని, ఇంతకంటే ఏం చెప్పలేమన్నారు. గవర్నర్ నిర్ణయంపై సుప్రీం ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం తేలాలంటే రేపే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.