నిర్భయ దోషి ముఖేశ్ కుమార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, అత్యవసరంగా విచారించలేమని స్పష్టీకరణ..
నిర్భయ దోషులు న్యాయ ప్రక్రియ పేరుతో కాలయాపన చేస్తున్నారు. రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం, తర్వాత సుప్రీంకోర్టులో తీర్పును సవాల్ చేయడం, క్యురేటివ్ పిటిషన్ వేస్తూ.. శిక్ష నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందుతున్నారు. తాజాగా పాటియాలా కోర్టు నిర్భయ నలుగురు దోషులకు మార్చి 20వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని డెత్ సెంటెన్స్ జారీచేసింది. దీనిపై దోసి ముఖేశ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అత్యవసరంగా విచారించలేం..
పిటిషన్ను వెంటనే విచారించాలని ముఖేశ్ సింగ్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. సోమవారం పిటిషన్ విచారించాలని కోరగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఈ నెల 16వ తేదీన పిటిషన్ విచారణ చేపడుతామని పేర్కొన్నది. దోషి ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్ను భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. గతనెల 17వ తేదీన తిరస్కరించిన సంగతి తెలిసిందే.
మూడోసారి
మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు నిర్భయ దోషులను ఉరితీయాలంటూ గురువారం ఢిల్లీ పాటియాలా కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉరిశిక్ష అమలుకు మూడుసార్లు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత దోషులు న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటూ శిక్షను వాయిదాపడేలా చేశారు. ఇప్పుడు న్యాయపరమైన అవకాశాలన్నీ వినియోగించుకోవడంతో ఉరి ఖాయమైనట్లేనని తెలుస్తోంది.
ఇదీ కేసు నేపథ్యం..
2012లో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై ఆరుగురు మృగాళ్లు లైంగికదాడి చేసి, దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా.. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దోషి రామ్ సింగ్, తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. మరొకడు జువైనల్ హోం నుంచి బయటకొచ్చాడు. మరో నలుగురు దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేశ్ కుమార్ జైలులో ఉన్నారు. వీరికి కోర్టు ఉరిశిక్ష విధించగా.. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే. తర్వాత దోషులు పాటియాలా కోర్టును ఆశ్రయించడంతో ఫిబ్రవరి 1వ తేదీన విధించాల్సిన ఉరిశిక్ష వాయిదా పడింది. తర్వాత కూడా వాయిదా పడింది.