నీట్,జేఈఈ : ఆ ఆరుగురు ముఖ్యమంత్రులకు షాక్... రివ్యూ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీం
నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అగస్టు 17న సుప్రీం నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ ఆరుగురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం తాజా తీర్పుతో పరీక్షలకు ఇక ఎలాంటి ఆటంకం లేనట్లే.
నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణకు గతంలో సుప్రీం ఇచ్చిన అనుకూల తీర్పుపై తాజా పిటిషన్లో ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల జీవించే హక్కును కాలరాయడమేనని పేర్కొన్నారు.సుప్రీం కోర్టు కొన్ని లాజికల్ అంశాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు.
ట్రాన్స్పోర్ట్,హోటల్స్,రెస్టారెంట్స్ ఇతరత్రా అన్నీ మూసివున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులు వేరే చోటకు వెళ్లి పరీక్షలు ఎలా రాయగలరని అందులో ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ తరుపున మంత్రి మొలొయ్ ఘటక్,జార్ఖండ్ తరుపున మంత్రి రామేశ్వర్,రాజస్తాన్ తరుపున మంత్రి రఘు శర్మ,ఛత్తీస్గఢ్ తరుపున అమర్జీత్ భాగట్,పంజాబ్ తరుపున మంత్రి బీఎస్ సింధు,మహారాష్ట్ర తరుపున మంత్రి ఉదయ్ రవీంద్ర సావంత్ సుప్రీంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
నీట్,జేఈఈ విషయంలో ప్రతిపక్షాల రాద్దాంతం,రాజకీయం తగదని కేంద్రం ఇదివరకే పేర్కొంది. విద్యార్థులకు భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో రాజకీయం తగదని ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వ్యాఖ్యానించారు.షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కాగా,సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ,సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలు జరగునన్న సంగతి తెలిసిందే. జేఈఈ కోసం 9.53లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. నీట్ కోసం 15.97లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు