మద్యం అమ్మకాల నిషేధం పై సుప్రీం తీర్పు... ఆన్లైన్ అమ్మకాలపై ధర్మాసనం ఏం చెప్పింది..?
న్యూఢిల్లీ: కరోనావైరస్ వల్ల దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. అయితే మార్చి 25 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు లాక్డౌన్ను పొడిగిస్తూ పలు ఆంక్షలు విధించింది కేంద్రం. అయితే తాజాగా పలు జోన్లలో ఆంక్షల సడలింపును ఇచ్చిన కేంద్రం మద్యం దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో మద్యంపానం అమ్మకాలపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం మద్యం అమ్మకాలపై నిషేధం విధించేలా ఆదేశాలు ఇచ్చేందుకు తిరస్కరించింది. అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది.
షాకింగ్: పోలీస్స్టేషన్లోని మద్యం బాటిళ్లు మాయం, ఇంటి దొంగలపనేనా? ఎక్కడంటే?
మద్యం దుకాణాలు తెరవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మద్యం దుకాణాల ముందు గుంపులు గుంపులుగా గుమికూడుతున్నారని దీంతో కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ పిల్ దాఖలైంది. ఇక పిల్ను విచారణ చేసిన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేందుకు తిరస్కరిస్తూనే ఆన్లైన్ ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టాలని లేదా హోమ్ డెలివరీ ఆప్షన్ను పరిశీలించాలని ప్రభుత్వాలకు సూచించింది న్యాయస్థానం. ఇలా చేస్తే రద్దీ ఉండదని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు మద్యం అమ్మకాల విషయంలో కోర్టు జోక్యం ఉండబోదని స్పష్టం చేసిన న్యాయస్థానంఅదే సమయంలో అది విధానపరమైన నిర్ణయమని గుర్తుచేసింది. ఆ తర్వాత పిల్ను కొట్టివేసింది.
మద్యం దుకాణాల వద్ద సామాజిక దూరం మద్యం ప్రియులు పాటించడం లేదని, అదే సమయంలో తెరిచిన మద్యం దుకాణాలు చాలా తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల రద్దీ ఎక్కువగా ఉందని పిటిషనర్ తరపున న్యాయవాది సాయిదీపక్ న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం పైవిధంగా ఆదేశాలు ఇచ్చింది. మే 4న లాక్డౌన్ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కంటెయిన్మెంట్ జోన్లలో తప్ప మిగతా జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది కేంద్రప్రభుత్వం. తొలిరోజున ఢిల్లీలో మద్యం దుకాణాల ముందు పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు. అదే సమయంలో కిలోమీటర్ల మేరా మద్యం దుకాణాల ముందు బారులు తీరారు మందుబాబులు. దీంతో ఢిల్లీ సర్కార్ 70శాతం మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ మందుబాబులు మాత్రం మద్యం కొనుగోలు చేసేందుకు క్యూలైన్లలో నిలబడ్డారు.
ఇక రద్దీని దృష్టిలో ఉంచుకున్న ఢిల్లీ ప్రభుత్వం ఈ-టోకెన్ల విధానంను ప్రవేశపెట్టింది. అంటే కస్టమర్లు ఫలానా సమయంలో మాత్రమే మద్యంను కొనుగోలు చేసే విధానాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల సామాజిక దూరం ఉల్లంఘన, రద్దీ కూడా తగ్గుతుందని కేజ్రీవాల్ సర్కార్ భావించి ఈ-టోకెన్ విధానంను తీసుకొచ్చింది.