నిజాయితీపరుల కోసం ఏం చేశారు?: నోట్ల రద్దుపై కేంద్రానికి సుప్రీం ప్రశ్న
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నోట్ల రద్దు ప్రక్రియపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నోట్ల రద్దు ప్రక్రియపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నోట్ల మార్పిడికి తగిన గడువు ఎందుకు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఆర్బీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసును జులై 18కి వాయిదా వేసింది. పెద్ద నోట్ల రద్దుపై వ్యవహారంపై సుప్రీంకోర్టులో దాఖైలన ప్రజాప్రయోజనవ్యాజ్యంపై విచారించిన ధర్మాసనం ఈ విధంగా స్పందించింది.
రద్దైన నోట్లు మార్చుకోవడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. నిజాయితీపరులు నష్టపోకుండా చూడాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.
కాగా, పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పిస్తామని కేంద్రం పేర్కొంది. 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.