రాఫెల్ డీల్ కేసు: తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: రాఫెల్ కేసులో రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టులో గురువారం విచారణ జరిగింది. రాఫెల్ ఒప్పందం గురించి కోర్టుకు ఇచ్చిన కాగ్ నివేదికలో పొరపాటు జరిగిందని అటార్నీ జనరల్ (ఏజీ) తెలిపారు. కాగ్ రిపోర్టులో మొదటి మూడు పేజీలు మిస్ అయ్యాయని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.
యూపీ సహా ఆ రాష్ట్రాల నష్టానికి బీజేపీ ఇలా చెక్: చక్రం తిప్పుతున్న తెలుగోడు!
మిస్సింగ్ పేజీలను రికార్డుల్లో చేర్చేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని ఏజీ కోరారు. లీకైన రాఫెల్ పత్రాలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. దేశ భద్రత దృష్ట్యా వాటిని గోప్యత పత్రాలుగా పరిగణించాలని చెప్పారు. అటార్నీ జనరల్ వ్యాఖ్యలపై రివ్యూ వేసిన పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం రాఫెల్ పైన తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్లో పెట్టింది.
అంతకుముందు, బుధవారం నాడు కూడా విచారణ జరిగింది. రాఫేల్ ఒప్పందంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటున్న పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాలు జాతీయ భద్రతా కోణంలో సున్నితమైనవని కేంద్రం పేర్కొంది. అదే విషయాన్ని సుప్రీం కోర్టుకు నివేదించింది. ఈ పత్రాలను ఫొటోకాపీ చేయడం ద్వారా కుట్రదారులు దొంగతనానికి పాల్పడ్డారని ఆరోపించింది. అవి లీక్ కావడంతో భద్రత ప్రమాదంలో పడిందని తెలిపింది. సున్నితమైన పత్రాలు ఎక్కడి నుంచి లీకయ్యాయన్నది తెలుసుకోవడం తమకు అత్యంత ముఖ్యమన్నారు. ఇందుకోసం అంతర్గత విచారణను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ మేరకు రక్షణ శాఖ ఒక అఫిడవిట్ను దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం విచారణ జరిగింది. అనంతరం సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
రాఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ గత ఏడాది డిసెంబర్ 14న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. దొంగిలించిన పత్రాల ఆధారంగా ఈ సమీక్ష పిటిషన్ను దాఖలు చేశారని ఈ నెల 6 న జరిగిన విచారణలో ఏజీ ఆరోపించారు. రెండు రోజుల తర్వాత ఆయన తన వాదనను సవరించుకున్నారు. రాఫేల్ పత్రాలు దొంగతనానికి గురికాలేదని, అసలు పత్రాలకు సంబంధించిన ఫొటోకాపీలను జత చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా రక్షణ శాఖ ఒక అఫిడవిట్ను దాఖలు చేసింది. పిటిషనర్లు అయిన కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పత్రాలు రాఫేల్ యుద్ధవిమానాల పోరాటానికి సంబంధించినవని అందులో పేర్కొంది.
వాటిని విస్తృతంగా పంపిణీ చేశారని, శత్రు దేశాలకూ అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. ఫ్రాన్స్తో కేంద్రం కుదుర్చుకున్న వివిధ ఒప్పందాల్లో గోప్యత అంశం ఉందని తన అఫిడవిట్లో రక్షణ శాఖ పేర్కొంది. జాతీయ భద్రతకు సంబంధించిన ఇతర అంశాలనూ ప్రస్తావించింది. సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసి, నేరానికి పాల్పడ్డారని తెలిపింది.