ప్రధాని వచ్చే వరకు చూస్తారా, ప్రజలు ఇబ్బందిపడాలా?: నేతలకు సుప్రీం ఝలక్
ఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఓ ఎక్స్ప్రెస్ వే విషయంలో ఇచ్చిన సందేశం నేతలకు చెంపపెట్టు అని అంటున్నారు. ప్రజలకు ఉపయోగపడేవాటిని రాజకీయ నాయకులు ప్రారంభిస్తారు. నేతలకు వీలుకానప్పుడు ప్రజలకు ఇబ్బంది అయిన సందర్భాల్లో వేచి చూడవద్దనేది సుప్రీం సందేశం.
ఢిల్లీలో ట్రాఫిక్ తీవ్రత నేపథ్యంలో జాతీయ రహదారుల సంస్థ నిర్మించిన ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి వచ్చి ప్రారంభించేంత వరకు దానిని అందుబాటులోకి తీసుకురాకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని వ్యాఖ్యానించింది.
ప్రధాని మోడీ ఏప్రిల్ 29వ తేదీన దీనిని ప్రారంభించాలని భావించారని, ముందుగా నిర్ణయమైన కార్యక్రమాల వల్ల ఆగిపోయిందని జాతీయ రహదారుల సంస్థ సుప్రీం కోర్టుకు తెలిపింది. దీనిపై సుప్రీం ఘాటుగా స్పందించింది.
ప్రధాని వచ్చి దానిని ప్రారంభించే వరకు ఎదురు చూడలేమని, జూన్ 1వ తేదీ కల్లా తప్పకుండా దానిని అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించింది.
దీనిపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. ఢిల్లీ ఎక్స్ప్రెస్ నిర్మాణం త్వరలో పూర్తవుతుందని, దానిని ప్రారంభించడానికి, ప్రధాని మోడీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. నిర్మాణం పూర్తి కాకపోవడం వల్లే ఆలస్యమవుతోందన్నారు. ఆయన ట్విట్టర్లోను స్పందించారు.
ఈ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రెండుసార్లు డేట్స్ ఇచ్చారని, కానీ టెక్నికల్ ఛాలెంజస్ వల్ల దీని ప్రారంభోత్సవం వాయిదా పడుతోందని వెల్లడించారు.