తలాక్: ముస్లీం చట్టాలు మారాలని మహిళ పిటిషన్
న్యూఢిల్లీ: ముస్లీం మహిళ ఒకరు.. మూడుసార్లు తలాక్ పైన సుప్రీం కోర్టు గడప తొక్కారు. దీనిపై సుప్రీం కోర్టు సోమవారం నాడు కేంద్రం స్పందన కోరింది. మైనార్టీ వర్గాల్లో పురుషులు, మహిళల మధ్య వివక్షను తొలగించాలని, మూడుసార్లు తలాక్ చెబితే విడాకులు అనే దానిని సవరించాలని ఆమె సుప్రీంను ఆశ్రయించారు.
ముస్లిం వ్యక్తిగత చట్టాలు ఎంతమాత్రమూ సమంజసం కాదని, అవి భారత రాజ్యాంగ విరుద్ధమని షాయారా బానూ అనే యువతి ఈ పిటిషన్ వేశారు. దీనిని సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో ఏం చేయాలో సూచించమని కేంద్రంను ప్రశ్నించింది.
ముస్లిం మతంలో అమలవుతున్న తలాక్ ఏ బిదత్ (మూడుసార్లు తలాక్ అంటే విడాకులు), నిఖా హలలా, బహుభార్యత్వం తదితరాలు రాజ్యాగంలోని 14, 15, 21 ఆర్టికల్స్ ఉల్లంఘనేనని షాయారా ఆరోపించారు. తన భర్త చేస్తున్న గృహ హింసను ప్రశ్నించినందుకు తనకు మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులు ఇచ్చేసినట్టు ప్రకటించాడని, ఇదెలా కుదురుతుందని ఆమె ప్రశ్నించారు.
సుప్రీం న్యాయమూర్తులు అనిల్ ఆర్ దవే, ఎకె గోయల్లతో కూడిన ధర్మాసనం... మత విశ్వాసాలతో కూడుకున్న ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై కేంద్రం కల్పించుకోవాలని సూచించింది. ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసిందని, భారత దేశంలో చట్టాలు మారాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నానని ఈ సందర్భంగా షాయారా వ్యాఖ్యానించారు.