సాకులొద్దు: సోషల్ మీడియా దుర్వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్, కేంద్రానికి గడువు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దుర్వినియోగం కావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది.
తమ వద్ద అంత సాంకేతికత లేదనే సాకులు చెప్పి తప్పించుకోవద్దని కేంద్రానికి స్పష్టం చేసింది. మార్గదర్శకాల రూపకల్పనకు కావాల్సిన సమయాన్ని మూడు వారాల్లోగా తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
జస్టిస్ దీపక్ గుప్తా, అనిరుధా బోస్లతో కూడిన ధర్మాసనం సోషల్ మీడియా దుర్వినియోగంపై మంగళవారం విచారణ చేపట్టింది. నకిలీ వార్తల్ని ఎవరు, ఎక్కడ సృష్టిస్తున్నారో కొన్ని సోషల్ మీడియా సంస్థలు గుర్తించలేకపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన సాంకేతికత లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని కేంద్రానికి తేల్చి చెప్పింది.
సృష్టించే సాంకేతిక ఉన్నప్పుడు.. అడ్డుకునే సాంకేతికత కూడా ఉంటుంది కదా అని వ్యాఖ్యానించింది. సాంకేతికత అంశాలతో ముడిపడిన ఈ సమస్య పరిష్కారానికి కోర్టులు సరైన వేదికలు కావని, ప్రభుత్వమే జోక్యం చేసుకుని తగు మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించింది.
ఇటీవల కాలంలో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, టిక్టాక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో తప్పుడు, నకిలీ వార్తలు ఎక్కువగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అది ఎలాంటి వార్త అయిన సోషల్ మీడియా ద్వారా అత్యంత వేగంగా జనాల్లోకి వెళ్లిపోతోంది.
అయితే, అవి వినియోగదారులను తప్పుదోవ పట్టించేవిగా ఉండటం, జనాల్లో అనవసర ఆందోళనలకు దారితీయడంతో సుప్రీంకోర్టు ఈ విషయంపై సీరియస్గా స్పందించింది. కేంద్రం ఇప్పటికే సోషల్ మీడియా సంస్థలు నకిలీ వార్తలపై ఓ కన్నేసి ఉంచాలని, వాటిని కట్టడి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.