అఫిడవిట్పై వివరణ ఇవ్వండి!.. సీజేఐ కేసులో లాయర్కు సుప్రీం నోటీసు!
ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టించాయి. సీజేఐ తనను వేధించారంటూ సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఫిర్యాదు న్యాయ వ్యవస్థను కుదిపేసింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ కోసం ఏర్పాటైన స్పెషల్ బెంచ్ ఏర్పాటైంది. జస్టిస్ అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం కేసు విచారణ జరిపింది.
తీర్పుల ఎఫెక్ట్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై లైంగిక ఆరోపణలు.. విచారణకు ఆదేశం
లాయర్కు నోటీసులు
లైంగిక వేధింపుల కేసుతో సీజేఐ రంజన్ గొగోయ్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని లాయర్ ఉత్సవ్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం అడ్వకేట్ ఉత్సవ్కు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్లో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వడంతో పాటు కుట్రలో భాగస్వామ్యులుగా ఉన్నవారి వివరాలు ఇవ్వాలని సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
అఫిడవిట్లో సంచలన అంశాలు
లైంగిక వేధింపుల పేరుతో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని అడ్వకేట్ ఉత్సవ్ అఫిడవిట్లో స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేసి ఆయనతో రాజీనామా చేయించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సీజేఐపై ఒత్తిడి పెంచేలా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని అడిగారని ఉత్సవ్ సింగ్ స్పష్టం చేశారు., ఆరోపణలు చేసిన మహిళ తరఫున వాదించేందుకు తనకు కోటిన్నర రూపాయల ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు.
సీజేఐకు 26మంది జడ్జిల మద్దతు?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్కు 26మంది సుప్రీం జడ్జిలు బాసటగా నిలిచినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్ట్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సైతం సీజేఐపై వచ్చిన ఆరోపణల్ని ఖండించింది. ఇలాంటి చర్యలతో న్యాయ వ్యవస్థను భ్రష్టుపట్టించే ప్రయత్నం జరుగుతోందని తీర్మానం చేసింది.
మహిళపై ఇది వరకే కేసులు
ఇదిలా ఉంటే కీలక కేసుల తీర్పులు వెలువరించాల్సి ఉన్నందునేఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని జస్టిస్ రంజన్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ తాను ఎలాంటి జంకు లేకుండా విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా తనపై ఆరోపణలు చేసిన మహిళపై రెండు క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని రంజన్ గొగోయ్ ప్రస్తావించారు. మరోవైపు సీజేఐపై లైంగిక వేధింపులకు సంబంధించి మీడియా కవరేజీపై ధర్మాసనం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ఈ అంశంపై మీడియా సంయమనంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.