పార్లమెంటు కొత్త భవనంపై కేంద్రానికి సుప్రీం షాక్- నిర్మాణానికి బ్రేక్-10న శంఖుస్దాపనకు ఓకే
ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణం కోసం కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న ఈ నిర్మాణాల వల్ల ప్రస్తుత పార్లమెంటు భవనం దెబ్బతింటుందని, వందలాది పురాతన వృక్షాలు నేలకూలుతాయనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే వాదనతో దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు తక్షణం ఆపాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది.
వాస్తవానికి సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పేరుతో చేపడుతున్న పార్లమెంటు కొత్త భవనానికి ఈ నెల 10న ప్రధాని మోడీ శంఖుస్ధాపన చేయాల్సి ఉంది. దీంతో సుప్రీంకోర్టులో ఈ అంశంపైనా విచారణ జరిగింది. వాదనల అనంతరం ప్రాజెక్టు శంఖుస్ధాపన కోసం ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేసింది. అయితే నిర్మాణ పనులు ఆపాల్సిందేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీం ధర్మాసనం సూచించింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు... కేంద్రం ఇంత హడావిడిగా ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్తుందని తాము అనుకోలేదని తెలిపింది.
కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి శంఖుస్ధాపన చేసుకునేందుకు అనుమతిచ్చిన సుప్రీంకోర్టు.. నిర్మాణ పనులు మాత్రం జరగకూడదని స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను కదపడం కానీ, చెట్లు నరకడం కానీ జరగకూడదని సూచించింది. సెంట్రల్ విస్తా ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్ల విచారణ పూర్తయ్యే వరకూ తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. తుది తీర్పు వచ్చాకే కేంద్రం ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
Recommended Video
కేంద్రం ప్రస్తుత పార్లమెంటు భవనం స్ధానంలో సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పేరుతో కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. రూ.971 కోట్ల ఖర్చుతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంతో చేపట్టే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును టాటా కన్స్ట్రక్షన్స్ కు అప్పగించారు. భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించే ఈ భవన నిర్మాణ పనుల్లో 2 వేల మంది ప్రత్యక్షంగానూ, 9 వేల మంది పరోక్షంగానూ పాల్గొంటారు. 1224 మంది ఎంపీలు ఒకేసారి సమావేశమయ్యేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే పాత భవనాన్ని పురావస్తు సంపదగా మార్చి పర్యాటకులను అనుమతించాలని కేంద్రం భావిస్తోంది.