మ్యాన్హోల్స్ మరణాలపై సుప్రీంకోర్టు సీరియస్..కేంద్రం ఏం చేస్తోందంటూ ప్రశ్న
న్యూఢిల్లీ: మ్యాన్ హోల్లో పడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగిపోతుండటంతో సుప్రీంకోర్టు కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాన్హోల్స్లో పడి ప్రతినెలా ఐదుగురు మృతి చెందుతున్నారని దీన్ని ఈజీగా వదిలేయలేమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ ఛాంబర్లలోకి వెళ్లి చావమని ఏ దేశం ప్రోత్సహించదని కేంద్రం పేర్కొంది. గతేడాది ఎస్సీ ఎస్టీ చట్టంలోని అంశాలను కేంద్రం తొలగించడంతో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ కేంద్రం వేసిన పిటిషన్ను విచారణ చేశారు జస్టిస్ అరుణ్ మిశ్రా.
మనుషులంతా ఒక్కటే అని అందరినీ సమానంగా చూడాలని అదే సమయంలో సదుపాయాలు కూడా అదే స్థాయిలో కల్పించాలని కోరింది. ఇక మ్యాన్హోల్స్ను, డ్రైనేజీలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు ఆక్సిజన్ సిలిండర్లు మాస్కులు ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను జడ్జి ప్రశ్నించారు. ఈ దేశంలో అంటరానితనంను నిషేధిస్తూ రాజ్యంగంలో ఉన్నప్పుడు అలాంటి పారిశుద్ధ్య కార్మికులకు షేక్హ్యాండ్ ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రశ్నించింది. అందుకే భారత దేశం ఇంకా ఇలానే ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పరిస్థితులు ఇప్పటికైనా మారాలని చెప్పారు. మనుషులను ఈ రకంగా చూడటం దారుణం అని అని న్యాయస్థానం అభిప్రాయపడింది.
పౌర తప్పిదాలు దాని వల్ల కలిగే నష్టాలకు ఫలానా వారిని బాధ్యులుగా చేయడం ఇంకా ఈ దేశంలో చట్టం రూపొందించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. ఇక న్యాయమూర్తులు స్వయంగా ఇలాంటి సంఘటనలను తెలుసుకునేందుకు అధికారం లేదని న్యాయస్థానంకు సూచించారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. వీధులను శుభ్రం చేసేవారిపై, మ్యాన్హోల్స్ను క్లీన్ చేస్తున్న వారిపై కేసులను నమోదే చేయలేమని చెప్పారు. అయితే వారికి ఫలానా పని పూర్తి చేయాల్సిందిగా పురమాయించిన అధికారులపై చర్యలు తీసుకోవచ్చని న్యాయమూర్తితో చెప్పారు.