డీకే శివకుమార్ బెయిల్: కోర్టు ఇచ్చే తీర్పులతో ఆటలా..ఈడీపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: కర్నాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును టేకప్ చేసిన సుప్రీంకోర్టు ఈడీని మందలించింది.
ఢిల్లీ హైకోర్టు నిర్ణయంను సుప్రీంలో సవాలు చేసిన ఈడీ
అక్టోబర్ 23వ తేదీన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు కాంగ్రెస్ నేత డీకే శివకుమార్కు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. బెయిల్ పై వదిలితే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని వాదనలు వినిపించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ద్విసభ్య ధర్మాసనం.
చిదంబరం కేసులో వినిపించిన వాదనలు ఇక్కడకూడానా.?
చిదంబరం కేసులో వినిపించిన వాదనలు తిరిగి ఇక్కడ ఎలా వినిపిస్తారని వాదనలు విన్న జస్టిస్ నారిమన్, జస్టిస్ రవీంద్ర భట్లు ఈడీపై ఆగ్రహం వ్యక్తి చేశారు. అంతేకాదు తనపై వచ్చిన ఆరోపణలను కొట్టివేయాలంటూ డీకే శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్కు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. పౌరులతో వ్యవహరించే పద్ధతి ఇది కాదని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమాన్ అన్నారు. ఇక కోర్టు కేసుపై తన నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత చివరి నిమిషంలో సాల్సిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుని ఈడీ అభ్యర్థనను తిరస్కరించొద్దని విజ్ఞప్తి చేశారు.
తమాషాగా ఉందా..కోర్టు తీర్పులతో ఆటలా..?
సాల్సిటర్ జనరల్ తుషార్ మెహతా చివరి నిమిషంలో ఈడీ అభ్యర్థనను తిరస్కరించొద్దని కోర్టును కోరగా.. జస్టిస్ నారిమాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తప్పుపట్టరాదని హెచ్చరించారు. శబరిమలలో తమ తీర్పును పరిశీలించాలని కోరారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పులతో ఆటలాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు ఎప్పటికీ నిలిచిపోతాయని ప్రభుత్వానికి తెలపండంటూ నారిమాన్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి తీర్పునకు విలువ ఉందని చెబుతూ తుషార్ మెహతా కాస్త తగ్గారు.
ప్రభావితం చేసేందుకు శివకుమార్ అధికార పార్టీలో లేరు
గత నెలలో బెయిల్పై విడుదలైన డీకే శివకుమార్ సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పగా.. ఇందుకు నిరాకరించారు జస్టిస్ నారిమాన్. శివకుమార్ సాక్షులను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీలో లేరని తాను ప్రతిపక్షపార్టీలో ఉన్నారని గుర్తుచేశారు నారిమాన్. ఇక అప్పటికే శివకుమార్ రెండు నెలలపాటు మనీలాండరింగ్ ఆరోపణలపై జైలులో ఉన్నారు.