ఎస్సీ, ఎస్టీ తీర్పుపై స్టే ఇవ్వండి: కేంద్రం అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని సుప్రీం కోర్టును కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించింది. అయితే, తాము ఇచ్చిన ఆ తీర్పు ఎంతమాత్రం ఎస్సీ, ఎస్టీల హక్కులను హరించదంటూ తన గత తీర్పును సమర్థించుకుంది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను మే 16కు వాయిదా వేసింది.
కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదనలు వినిపించగా.. కేంద్రం అభ్యర్థనపై జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్తో కూడిన ధర్మాసనం తన అభిప్రాయాన్ని వెలుబుచ్చింది. వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ చట్టసభలు రూపొందించిన చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు నిబంధనలు, మార్గదర్శకాలు గానీ ఉండకూడదని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ తీర్పు వల్ల కొన్ని ప్రాణాలు పోయాయని తెలిపారు. ఈ విషయంలో విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టాలన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ మార్చి 20న ఇచ్చిన తన ఆదేశాలను సమర్థించుకుంది. అన్ని అంశాలు, తీర్పులు క్షుణ్నంగా పరిశీలించాకే ఆదేశాలిచ్చామని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల హక్కులను '100 శాతం' హరించజాలదని స్పష్టం చేసింది.
ఎస్సీ, ఎస్టీల అట్రాసిటీ కేసుల విషయంలో సత్వర అరెస్టులు చేయరాదని సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఏప్రిల్ 2న పునఃసమీక్ష కోరుతూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ విషయంలో ఇతర పిటిషన్లను ఏమాత్రం స్వీకరించబోమని కోర్టు స్పష్టంచేసింది.