ఎఫ్ఐఆర్పై స్టే... ఆర్మీ మేజర్ ఆదిత్య కేసులో సుప్రీం సంచలన నిర్ణయం!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లోని షోపియన్లో గత నెలలో జరిగిన కాల్పులకు సంబంధించి ఆర్మీ అధికారులపై దాఖలైన ఎఫ్ఐఆర్పై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. కేసు నమోదు చేయడంపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ కేంద్రంతో పాటు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
షోపియన్లో జనవరి నెలలో ఆర్మీ వాహనంపై రాళ్లు రువ్విన ఆందోళన కారులపై సైనికులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మరణించడంతో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో అక్కడి పోలీసులు.. సైనికుల కాల్పులకు మేజర్ ఆదిత్యనాథ్ను బాధ్యుడిని చేస్తూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దీనిని సవాలు చేస్తూ మేజర్ ఆదిత్యనాథ్ తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ కరమ్వీర్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విధి నిర్వహణలో ఉన్న తన కుమారుడిపై అక్రమంగా కేసు నమోదు చేశారనీ, దీన్ని కొట్టివేయాలంటూ ఆదిత్యనాథ్ తండ్రి సుప్రీంను ఆశ్రయించారు.
సైనిక సిబ్బందిని, ఆర్మీ ఆస్తులను కాపాడుకునే క్రమంలోనే కాల్పులు జరిగాయని నివేదించారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం... సదరు ఎఫ్ఐఆర్పై స్టే విధించింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా మేజర్ ఆదిత్యపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.