మహారాష్ట్ర సర్కారుకు భారీ షాక్ - మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం స్టే - మిగతా రాష్ట్రాల్లో కోటాల మాటేంటి
నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు, నటి కంగనా రనౌత్ వివాదం వ్యవహారాలతో సతమతమైపోతున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి మరో భారీ షాక్ తగిలింలింది. రాష్ట్రంలోని మరాఠాలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తోన్న ప్రత్యేక రిజర్వేషన్లను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. 2018లో నాటి బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మరాఠా రిజర్వేషన్లకు అసలు చట్టబద్ధత ఉందా లేదా అనే అంశాన్ని విస్తృత ధర్మాసనం పరిశీలిస్తుందని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే శివసేన కూటమి, బీజేపీల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరినవేళ.. మరాఠా రిజర్వేషన్లపై స్టే అంశంపైనా అగ్గిరాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వీఆర్వో ఉద్యోగాలపై కేసీఆర్ క్లారిటీ - స్కేల్ ఉద్యోగులుగా వీఆర్ఏలు - మూడు శాఖలకు వాళ్లు బదిలీ
మరాఠా కోటాపై కీలక ఆదేశాలు
2020-21ఏడాదికిగానూ ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు మరాఠా కోటాపై స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎల్ఎన్ రావు నేతృత్వంలోని ముగ్గురు జడ్జిలతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. అంతేకాదు, అసలు మరాఠా కోటా చట్టబద్ధత ఉందా, లేదా అనే అంశాన్ని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం నిర్ణయిస్తుందని జడ్జిలు స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగాల్లో మరాఠా కోటాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలచ్చింది. అయితే.
ఇప్పటికే లబ్ది పొందినవాళ్ల సంగతేంటి?
మహారాష్ట్రలో 2018 నవంబర్ నుంచి మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈ రెండేళ్ల కాలంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు పొందగా, వేలాది మంది విద్యార్థులు వివిధ సంస్థల్లో అడ్మిషన్లు పొందారు. ఇప్పుడు రిజర్వేషన్లపై స్టే విధించిన దరిమిలా వాళ్ల పరిస్థితి ఏమిటనే వాదన కూడా సాగింది. దీనిపై క్లారిటీ ఇచ్చిన త్రిసభ్య ధర్మాసనం.. 2018 నుంచి ఈ ఏడాది ఇవాళ్టి(2020, సెప్టెంబర్ 9) వరకు ఆ కోటా ద్వారా ప్రయోజనం పొందినవారిపై ఈ ఉత్తర్వుల ప్రభావం ఉడబోదని, వాళ్లెవరూ ఉద్యోగాలు లేదా విద్యా సంస్థల్లో సీట్లు కోల్పోయే పరిస్థితి రాబోదని జడ్జిలు స్పష్టం చేశారు.
మిగతా రాష్ట్రాల మాటేంటి?
మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్ పై వివాదం ఈనాటిదికాదు. 2018లో బీజేపీ నేతృత్వంలోని ఫడ్నవిస్ సర్కారు తొలిసారిగా మరాఠాలకు విద్యా, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన కొద్దిరోజులకే వ్యతిరేక పిటిషన్లు దాఖలయ్యాయి. అనూహ్య రీతిలో బాంబే హైకోర్టు.. మరాఠా రిజర్వేషన్లను సమర్థించింది. కానీ 16 శాతం కోటా వీలుకాదని.. ఉద్యోగరంగంలో 12 శాతం కోటా, అడ్మిషన్లలో 13 శాతం కోటా సరిపోతుందని తీర్పు గతేడాది చెప్పింది. ప్రస్తుత శివసేన కూటమి సర్కారు సరిగా ప్రయత్నించనందునే మరాఠా కోటాపై వ్యతిరేక తీర్పు వచ్చిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పలు రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో ఆయా ప్రభుత్వాలు వివిధ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాయి. వాటిపై వివాదాలు చెలరేగి, పలు కేసులు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. మరాఠా కోటాపై సుప్రీం తాజా ఆదేశాల దరిమిలా మిగతా రాష్ట్రాల్లోని కోటాల మాటేంటనే చర్చ ఊపందుకుంది.
కొత్త రెవెన్యూ చట్టంలో సంచలనాలు-తహసీల్దార్లే రిజిస్ట్రార్లు-సమస్తం 'ధరణి'లోనే :అసెంబ్లీలో కేసీఆర్