అనిల్ అంబానీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు
ఎయిర్ సెల్ మాక్సిస్ 2జీ స్పెక్ట్రం కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్)కు సుప్రీంకోర్టు షాకిచ్చింది.
న్యూఢిల్లీ: ఎయిర్ సెల్ మాక్సిస్ 2జీ స్పెక్ట్రం కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్)కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. మలేసియా కంపెనీ మాక్సిస్ నుంచి 2జి లైసెన్స్ ను మరో కంపెనీకి బదిలీ చేయడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పు బట్టింది.
మనీ లాండరింగ్ కేసు కొనసాగుతుండగానే అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ మధ్య ప్రతిపాదిత ఒప్పందంపై సుప్రీంకోర్టు కోర్టు తాత్కాలికంగా స్టే విధించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం నిందితులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు నలుగురూ స్పెషల్ కోర్టు ఎదుట విధిగా హాజరుకావాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
వ్యాపార వేత్త ఆనంద్ కృష్ణన్, మలేసియా సంస్థ మాక్సిస్ కు చెందినా అగస్టస్ రాల్ఫ్ మార్షల్, మరో ఇద్దరు జనవరి 27లోపు కోర్టు ముందు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణకు ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.
విచారణకు ప్రమోటర్లు అంగీకరించకాపోతే 2016లో ఎయిర్ సెల్ కు కేటాయించిన 2జీ స్పెక్ట్రంను లైసెన్స్ ను సీజ్ చేయాలని తెలిపింది. నిందితులు కోర్టు ముందు హాజరుకాని పక్షంలో 2 వారాల్లోగా దానిని విక్రయించాలని టెలికాం శాఖకు స్పష్టం చేసింది.
అంతేకాదు, ఈ లైసెన్స్ ద్వారా ఆర్జించిన ఆదాయాన్ని కూడా స్వాధీనం చేసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ 2జి లైసెన్స్ బదిలీ ద్వారా చందాదారుల ప్రతికూల ప్రభావాన్ని నివారించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది.
సంచలనం రేపిన ఎయిర్ సెల్ మాక్సిస్ కుంభకోణంలో 2014 ఆగస్టులో మారన్ సోదరులతో పాటు మలేసియా వ్యాపారవేత్త ఆనంద్ కృష్ణన్ మీద, మలేసియాకు చెందిన మరో వ్యక్తి అగస్టస్ రాల్ఫ్ మార్షల్ పైన, సన్ డైరెక్ట్, మాక్సిస్ కమ్యూనికేషన్, సౌత్ ఏషియా ఎంటర్ టైన్ మెంట్ హోల్డింగ్స్, ఆస్ట్రో ఆల్ ఏషియా నెట్ వర్క్ మీద సిబిఐ చార్జ్ షీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.