కర్నాటకం : రెబెల్ ఎమ్మెల్యేల పిటీషన్లపై కాసేపట్లో సుప్రీం తీర్పు
కర్నాటకలో 15మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. తమ రాజీనామాలు ఆమోదించేలా స్పీకర్ను ఆదేశించాలంటూ కాంగ్రెస్- జేడీఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలు రెండు సార్లు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం కేసును ఇవాళ్టికి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం మూడు పక్షాల వాదనలు వింది. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘ వాదనలు వినిపించారు. స్వచ్చందంగా చేసిన రాజీనామాలను సైతం స్పీకర్ ఆమోదించడంలేదని, సంఖ్యాబలం తగ్గుతుందన్న కారణంతోనే జాప్యం చేస్తున్నారని రెబల్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వంలో కొనసాగలేమని చెబుతున్న ఎమ్మెల్యేలకు రెండుసార్లు విప్ జారీ చేయడాన్ని తప్పు బట్టారు.
ఇదిలా ఉంటే రాజీనామాలపై స్పీకర్ అలసత్వం ప్రదర్శించడం లేదని ఆయన తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఇప్పటికే రాజీనామాలపై విచారణ ప్రారంభించారని చెప్పారు. స్పీకర్కు ఎంతో అనుభవముందని, రాజీనామా, అనర్హతలపై సరైన నిర్ణయంతీసుకోగలరని అన్నారు. ఒకవేళ ఆయన దారి తప్పితే జోక్యం చేసుకోమని న్యాయమూర్తికి సింఘ్వీ విన్నవించారు.
ముఖ్యమంత్రి తరఫున వాదనలు వినపించిన లాయర్ రాజీవ్ ధవన్ ఇది స్పీకర్, సుప్రీంకోర్టుకు సంబంధించిన వ్యవహారంకాదని చెప్పారు. మాజీసీఎం, ముఖ్యమంత్రికి మధ్య పోరు అని కోర్టుకు వివరించారు. రెబెల్ ఎమ్మెల్యేలంతా వ్యక్తిగత ప్రయోజనాలతోనే రాజీనామాలు చేశారని, వాటిని అంగీకరిస్తే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నిర్వీర్యం చేసినట్లవుతుందని చెప్పారు. మూడు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును బుధవారానికి వాయిదా వేసింది.