అయోధ్య భూవివాదం కేసు: మధ్యవర్తిత్వ నివేదికపై ఆగష్టు 2న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: వివాదాస్పద అయోధ్య భూవివాదం కేసులో మధ్యవర్తులు ఓ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీ సుప్రీంకోర్టుకు సీల్డు కవర్లో సమర్పించిన నివేదికపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేయనుంది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేస్తుంది.
ఇక మధ్యవర్తుల కమిటీలో సభ్యులుగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వకేట్ శ్రీరాం పంచులు సభ్యులుగా ఉన్నారు. అయోధ్య టైటిల్ వివాదంపై ఒక పరిష్కారం కనుగొనేలా నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు సూచించింది. జూలై 18న విచారణ చేసిన సుప్రీంకోర్టు జూలై 31నాటికి రామజన్మభూమి బాబ్రీ మసీదు భూవివాదంపై నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తోంది. ఇందులో సభ్యులుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, అబ్దుల్ నజీర్లు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి వాదనలు ఎప్పుడు వినాలి అన్న అంశంపై ఆగష్టు 2న ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
అయోధ్య వివాదం పై మధ్యవర్తిత్వ కమిటీని మార్చి 8న సుప్రీంకోర్టు నియమించింది. 2010లో అలహాబాదు హైకోర్టు అయోధ్య కేసులో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో 14పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ సమయంలో 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని అందరికీ సమానంగా అంటే సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మొహి అఖారా మరియు రామ్లల్లాలకు పంచాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే 1992 డిసెంబర్ 6న 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది.