షాహీన్బాగ్ నిరసనలు: సుప్రీంకోర్టులో నేడు విచారణ..వారిని మరోచోటుకు తరలించాలంటూ పిల్ దాఖలు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా ఢిల్లీలోని షాహీన్బాగ్లో చేపడుతున్న నిరసనకారులను తమ నిరసనలను విరమించాల్సిందిగా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేయనుంది. షాహీన్బాగ్ ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తుల కమిటీ సోమవారం నివేదిక సబ్మిట్ చేసింది. అంతకుముందు విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం కేసు విచారణను బుధవారంకు వాయిదా వేసింది.
Recommended Video
ఫిబ్రవరి 17న సీనియర్ అడ్వకేట్ సంజయ్ హెగ్డేను షాహీన్బాగ్ నిరసనకారులతో చర్చలు జరిపి ఆపై ఒక నివేదికను కోర్టుకు సబ్మిట్ చేయాల్సిందిగా న్యాయస్థానం కోరింది. తమ నిరసనలు వేరే ప్రాంతంలో చేపట్టాలని నిరసనకారులను ఒప్పించే ప్రయత్నం చేయాల్సిందిగా అడ్వకేట్ సంజయ్కు సూచించింది. నిరసనలు తెలపడంతో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని నిరసనకారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోర్టు సంజయ్కు సూచించింది. తనతో పాటు మరొకరిని కూడా చర్చలు జరిపేందుకు తీసుకెళ్లాల్సిందిగా సంజయ్ను కోరింది న్యాయస్థానం
ఇక నిరసనకారులతో మాట్లాడిన సంజయ్.. నివేదికను జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు ఫిబ్రవరి 24న ఉంచింది. దీనిపై బుధవారం విచారణ చేపట్టనుంది కోర్టు. ఈ సమయంలో ఆ రిపోర్టును పిటిషనర్లతో కానీ లాయర్లతో కానీ పంచుకోకూడదని ఇప్పటికే న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే షాహీన్బాగ్లో వేల సంఖ్యలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఇందులో అధికంగా మహిళలే ఉండటం విశేషం. గతేడాది డిసెంబర్ మధ్య నుంచి వీరు షాహీన్బాగ్లో తమ నిరసనలను తెలుపుతున్నారు.
షాహీన్బాగ్ నిరసనలతో చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే వారిని అక్కడి నుంచి మరోచోట నిరసనలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నంద్ కిషోర్ గార్గ్ మరియు అమిత్ సాహ్నీలు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాలవ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేసింది.