సుప్రీంకోర్టులో..: 13న తేలనున్న 17 మంది అనర్హత ఎమ్మెల్యేల భవితవ్యం
న్యూఢిల్లీ: అనర్హత వేటుకు గురైన 17 మంది కర్ణాటక ఎమ్మెల్యే భవితవ్యం నవంబర్ 13న సుప్రీంకోర్టు తేల్చనుంది. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు గత శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో వారి అభ్యర్థనపై సుప్రీంకోర్టు నవంబర్ 13న విచారించనుంది.
డిసెంబర్ 5న 15 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు కోసం ఈ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడకముందే ఉపఎన్నికలు నిర్వహించడంపై ఆ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది జులైలో కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో వారిని అనర్హులుగా ప్రకటించారు. అంతేగాక, ప్రస్తుత అసెంబ్లీ ముగిసే వరకూ ఎన్నికల్లో పోటీ చేయరాదని తేల్చి చెప్పారు.
మాజీ సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానం పెట్టిన జులై 23 నుంచి ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు. ఈ రెబెల్ ఎమ్మెల్యే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించారు. అంతేగాక, స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. రాజీనామా చేసేందుకు వ్యతిరేకించినందుకు తమను అనర్హులుగా ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని సదరు నేతలు వాపోయారు. ఈ కేసులో పలువురు సీనియర్ న్యాయవాదులు కూడా వాదించేందుకు సిద్ధమయ్యారు. కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, దేవదత్త కామత్, శశికిరణ్ శెట్టి కాంగ్రెస్, జేడీ(ఎస్) తరపున వాదిస్తుండగా.. ముకుల్ రోహిత్గీ, సీఏ సుందరం, వీవీ గిరి, ఏకే గంగూలీ, కేవీ విశ్వనాథన్ ఎమ్మెల్యేల తరపున వాదిస్తుండటం గమనార్హం.
అక్టోబర్ 21న 15 నియోజకవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల సంఘం. అయితే, 17మంది అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారించిన తర్వాతే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ నగర్, మస్కిలో ఉపఎన్నికలు షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. డిసెంబర్ 5న ఉపఎన్నికలు జరుగనుండగా.. ఎమ్మెల్యేలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు ముగియకముందే ఎన్నికలు నిర్వహించడం సరికాదంటూ సుప్రీంకోర్టుకు విన్నవించారు.