అయోధ్య వివాదంపై కమిటీ మధ్యంతర నివేదిక.. నేడు కేసు విచారించనున్న సుప్రీంకోర్టు..
ఢిల్లీ : అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. సర్వోన్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ మధ్యంతర నివేదికను పరిశీలించనుంది. భూవివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాలని కోర్టు సూచించిన అనంతరం కేసు విచారణ జరగడం ఇదే తొలిసారి. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ జరపనుంది.
రామజన్మభూమి, బాబ్రీమసీదు స్థల వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. అత్యంత సున్నితమైన అంశం కావడంతో ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని భావించిన సుప్రీం ధర్మాసనం మార్చి8న ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్.ఎం.కలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వకేట్ శ్రీరామ్ పంచును కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ నేపథ్యంలో కమిటి మే 6న మధ్యంతర రిపోర్టును సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో అందజేసింది.
అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహీ అఖాడా, రామ్లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై 14మంది సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మాజీ జవాన్ తేజ్ బహదూర్కు సుప్రీం షాక్..