సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: కథువా కేసు విచారణ పఠాన్కోట్ కోర్టుకు బదిలీ
న్యూఢిల్లీ: కథువా కేసులో సుప్రీం కోర్టు సోమవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను పఠాన్కోట్ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. బాధిత కుటుంబానికి, న్యాయవాదికి, సాక్ష్యులకు రక్షణ కల్పించాలని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
'ప్రతీరోజు వాదనలు జరగాలి. కేసు విచారణ త్వరగతిన పూర్తి కావాలి. కోర్టు విచారణను కెమెరాలో రికార్డు చేయాలి. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించుకునేందుకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి అనుమతిస్తున్నాం' అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో తదుపరి వాదనను జులై 9కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
కథువాలో 8ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, ఆపై అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సాంజీరామ్ అనే మాజీ ప్రభుత్వ ఉద్యోగితో సహ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.