విదేశీ ఆస్తులపై స్పష్టతేదీ?: మాల్యాపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న ఆస్తుల పూర్తి వివరాలను వెల్లడించనందుకు లిక్కర్ వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యాపై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను నాలుగు వారాల్లో అందజేయాలని ఆదేశించింది.
గత ఫిబ్రవరిలో బ్రిటన్ సంస్థ డయాజియో నుంచి స్వీకరించిన 40 మిలియన్ డాలర్లకు సంబంధించిన వివరాలను అందజేయకపోవడం పట్ల జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారీమన్లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని బట్టి గత ఏప్రిల్ 7న ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలను అమలు చేయలేదని ప్రాథమికంగా నిర్ధారణ అవుతోందని పేర్కొంది.
40 మిలియన్ డాలర్లను ఎలా స్వీకరించారు. వాటిని ఏం చేశారన్న వివరాలు అందజేయాలని ఆదేశించింది. మాల్యా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, న్యాయస్థానాలను మోసం చేసేందుకు ప్రయత్నించాడని అటార్నీ జనరల్ రోహత్గీ పేర్కొన్నారు. సుమారు రూ.9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన విజయ్ మాల్యా.. లండన్ పారిపోయి అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే.