దీపక్ మిశ్రాతో భేటీ: సోమవారానికి కొలిక్కి వస్తుందని వేణుగోపాల్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై నలుగురు సీనియర్ న్యాయమూర్తులు చేసిన తిరుగుబాటు సమస్య కొలిక్కి పస్తుందని, సానుకూల ఫలితం వస్తుందని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ అన్నారు.
తన నివాసం నుంచి బయలుదేరుతూ ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అంతా సజావుగానే సాగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
సోమవారానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య ఐక్యత సాధ్యమవుతుందని ఆయన తమతో చెప్పినట్లు ఎన్డీటివీ రాసింది వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
న్యాయమూర్తులు జ్ఞానులు, పరిపాలనాదక్షులు, అనుభవజ్ఞులు అని, సమస్య మరింత తీవ్రరూపం దాల్చేలా చేస్తారని అనుకోవడం లేదని అన్నారు. నలుగురు న్యాయమూర్తులు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా తలెత్తిన వివాదం నేపథ్యంలో ఆయన దీపక్ మిశ్రాతో బేటీ అవుతున్నారు.
దీపక్ మిశ్రా నలుగురు న్యాయమూర్తులతో కూడా సమావేశమవుతారని సమాచారం. ఆ తర్వాత శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ కార్యదర్శి నృేంద్ర మిశ్రా కూడా ప్రధాన న్యాయమూర్తి నివాసం వద్ద కనిపించారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా శనివారం సమావేశమైంది. శనివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.