Corona Scam: PPE కిట్లు, మాస్క్ లు, మందుల భారీ స్కాం ?, ప్రభుత్వం చేతివాటం, దేన్నీ వదలరా !
బెంగళూరు/ న్యూఢిల్లీ: భారతదేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికార పార్టీ నాయకులు చేసే స్కామ్ లకు ఏం తక్కువ ఉండదని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. ప్రస్తుతం కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని కట్టడి చెయ్యడానికి ప్రభుత్వాలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే అధికారంలో ఉన్న నాయకులు కరోనా వైరస్ కట్టడి కోసం కేటాయించిన నిధులు సైతం స్వాహా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై PAC కమిటి విచారణ జరిపించడానికి సిద్దం అయితే స్పీకర్ అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పీకర్ కార్యాలయం, ఆరోగ్య శాఖ మంత్రి అంటున్నారు.
వాడుకుని వదిలేసిన ప్రియుడు, నటి ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలో షాకింగ్ నిజాలు, రూ. లక్షలు స్వాహా !
కరోనా కోసం కొనుగోలు
కర్ణాటకలో కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం అనేక పరికరాలు కొనుగోలు చేశారు. కరోనా క్వారంటైన్ లో, కరోనా ఐసోలేషన్ వార్డుల్లో ఉంటున్న రోగుల కోసం వెంటిలేటర్లు, PPE కిట్లు, శానిటైజర్స్, మాస్క్ లు తదితర పరికరాలు కొనుగోలు చేశారు. కరోనా వైరస్ కట్టడి కోసం ఇప్పటి వరకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిసింది.
అసెంబ్లీ PAC Committee
కర్ణాటక అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటి (PAC) చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హెచ్.కే. పాటిల్ ఉన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం కొనుగోలు చేసిన పరికరాలు, మందులు, ఆహారం తనతో పాటు కమిటీ సభ్యులు కొందరు అనేక ఆసుపత్రుల్లో పరిశీలించామని, ఆ పరికరాలు భోగస్ కంపెనీల పేర్లతో కొనుగోలు చేశారని, చాలా నాసిరకంగా ఉన్నాయని, వాటి ధరలు మాత్రం ఆకాశంలో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేత హెచ్.కే. పాటిల్ ఆరోపించారు.
20 మంది ఎమ్మెల్యేలు
PAC కమిటీలో అన్ని పార్టీలకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ నేత హెచ్.కే. పాటిల్ తో పాటు కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్, జేడీఎస్ నేత, మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ, టీఏ. శరవణ, బీజేపీ నాయకులు, మాజీ మంత్రులు మురగేష్ నిరాణి, ఉమేష్ కత్తి తదితర సీనియర్ ఎమ్మెల్యేలు సీఏసీ కమిటిలో ఉన్నారు.
స్పీకర్ ఇలా చేస్తారా ?
కరోనా వైరస్ కట్టడి కోసం కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన పరికరాలను 10 రోజుల పాటు తమ కమిటీ సభ్యులు అనేక ఆసుపత్రుల్లో పరిశీలించామని, అవి చాలా నాసిరకంగా ఉన్నాయని పీఏసీ కమిటి చైర్మన్ హెచ్.కే. పాటిల్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై విచారణకు ఆదేశించాలని కర్ణాటక స్పీకర్ కు మనవి చేస్తే ఆయన పట్టించుకోవడం లేదని హెచ్.కే. పాటిల్ ఆరోపించారు.
ఇంత గోల్ మాల్ జరిగితే ?
అయితే కాంగ్రెస్ పార్టీ నేత హెచ్.కే. పాటిల్ ఆరోపణలపై స్పీకర్ కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. ఇంత వరకు ఈ విషయంపై విచారణ కోసం ఎవ్వరూ తమను సంప్రధించలేదని స్పీకర్ కార్యాలయం వివరణ ఇచ్చింది. అయితే తాము నేరుగా కర్ణాటక స్పీకర్ ను కలుసుకుని ఈ స్కామ్ విషయంపై విచారణ జరిపించాలని లిఖితపూర్వకంగా మనవి చేస్తామని హెచ్.కే. పాటిల్ ప్రముఖ మీడియా సంస్థకు చెప్పారు.
ఎవరికి మాస్క్ లు వేస్తారు ?
N95 మాస్క్ ఒక్కటి రూ. 147కు కొనుగోలు చేస్తే ఆరోగ్య శాఖ అధికారులు ఒక్క మాస్క్ రూ. 295కు కొనుగోలు చేశామని లెక్కలు చెబుతున్నారని, ఇలా రూ. ఎన్ని కోట్లు స్కామ్ చేశారో అనే విషయం బయట పెట్టడానికి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని హెచ్.కే. పాటిల్ అన్నారు.
Recommended Video
విచారణ అవసరమా ఫ్రెండ్ !
కరోనా వైరస్ కట్టడి కోసం ఏఏ పరికరాలు ఎంతెంత ధరలకు కొనుగోలు చేశామో అని పూర్తి వివరాలను బోర్డుల్లో పెట్టి అందరికి తెలిసేలా బహిరంగంగా పెట్టామని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని, ఈ ఆరోపణలపై విచారణ జరిపించాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు.