బెంగళూరు అపార్ట్ మెంట్ లో ట్యాంక్ శుభ్రం, ముగ్గురు కార్మికులు దుర్మరణం!
బెంగళూరు: బెంగళూరు నగరంలో మరోసారి దారుణం జరిగింది. ఎస్ టీపీ ట్యాంక్ (మ్యాన్ హోల్) శుభ్రం చెయ్యడానికి వెళ్లిన ముగ్గురు కార్మికులు ఊపిరిఆడక మరణించిన ఘటన బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్ సమీపంలోని బండేపాళ్యలో జరిగింది.
బండేపాళ్యలోని ఎన్ డీ. నేషనల్ అపార్ట్ మెంట్ ఉంది. అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మ్యాన్ హోల్ శుభ్రం చెయ్యాలని నారాయణప్వామి (34) అనే వ్యక్తికి అపార్ట్ మెంట్ నిర్వహకులు చెప్పారు. నారాయణస్వామి తనకు పరిచయం ఉన్న శ్రీనివాస్ (56), మాదే గౌడ (42) అనే ఇద్దరిని పిలుచుకుని అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్లారు.
మొదట నారాయణస్వామి 12 అడుగుల లోతుఉన్న ఎస్ టీపీ ట్యాంక్ లోకి దిగారు. ఆ సందర్బంలో ఊపిరిఆడక లోపలకుప్పకూలిపోయాడు. నారాయణస్వామి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శ్రీనివాస్ లోపలికి వెళ్లాడు. అతను ఊపిరిఆడక కుప్పకూలిపోయాడు.
నారాయణస్వామి, శ్రీనివాస్ బయటకు రాలేదని మాదే గౌడ లోపలికి వెళ్లి అతను ఊపిరిఆడక కుప్పకూలిపోయాడు. ఎస్ టీపీ ట్యాంకు లోపలికి వెళ్లిన ముగ్గురు కార్మికులు బయటకు రాకపోవడంతో అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డులు వెళ్లి పిలిచినా వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.
విషయం తెలుసుకున్న అపార్ట్ మెంట్ అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా అప్పటికే నారాయస్వామి, శ్రీనివాస్ మరణించిన విషయం వెలుగు చూసింది. మృత్యువుతో పోరాడుతున్న మాదేగౌడను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే మాదేగౌడ మృతి చెందాడని పోలీసులు అన్నారు. విషయం తెలుసుకున్న ఏసీపీ సీమంత్ కుమార్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా లోపలికి దిగడం వలనే ముగ్గురూ మరణించారని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.