జాతీయ గీతం నిషేదించిన స్కూల్ మేనేజర్ అరెస్టు
అలహాబాద్: పాఠశాలలో విద్యార్థులు, సిబ్బంది జాతీయ గీతం ఆలపించరాదని నిబంధనలు విధించిన ఆ స్కూల్ మేనేజర్ ను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. తాను నిజమే చెప్పానని మా స్కూల్ లో జాతీయ గీతం ఆలపించమని ఆ మేనేజర్ సమర్థించుకుంటున్నాడు.
అలహాబాద్ లోని బఘారా ప్రాంతంలో ఉన్న ఎంఏ కాన్వెంట్ స్కూల్ మేనేజర్ జియా ఉల్ హక్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నామని సోమవారం పోలీసు అధికారులు తెలిపారు. జీతీయ గీతంలో 'భారత భాగ్య విధాత ' అనే పదాలు ఉన్నాయని, అవి ఇస్లాం మతాన్ని ఉల్లంఘించే పదాలు అని హక్ టీచర్లకు చెప్పాడు.
స్కూల్ ప్రిన్సిపాల్ రీతూ త్రిపాఠీతో పాటు మొత్తం 8 మంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ గీతాన్ని అవమానిస్తున్న హక్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కొలోనెల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అదే విధంగా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు షాక్ కు గురైనారు. ఎలాంటి అనుమతులు లేకుండా హక్ పాఠశాల నిర్వహిస్తున్నాడని తెలుసుకున్నారు.
హక్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 12 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ లో జాతీయ గీతం పాడటం లేదని అధికారుల విచారణలో వెలుగు చూసింది.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి హక్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. జాతీయ గీతంలో 'భారత భాగ్య విధాత' అనే పదం ఉందని, అంటే భారతదేశం మా విధిని ఎలా నిర్ణయిస్తుంది ? అని హక్ ప్రశ్నిస్తున్నాడు.
మా విధి నిర్ణయించిందే ఆ అల్లాయే, మా విధి విధాత ఆయనే అని హక్ అంటున్నాడు. భారత్ మా విధి నిర్ణయిస్తుందని అని మేము ఎలా చెబుతాం, నేను చేసింది కరెక్ట్ అని హక్ వాదిస్తున్నాడు. ఈ స్కూల్ లో 300 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఆ స్కూల్ కు అనుమతులు లేవని తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.