పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్: పోలీసు స్టిక్కర్ అతికించిన వాహనంలో: సీఆర్పీఎఫ్ జవాన్ తో పాటు!
లక్నో: మహిళలు, బాలికలపై యథేచ్ఛగా కొనసాగుతోన్న అత్యాచారాలు, హత్యోదంతాలపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాల చెలరేగుతున్నప్పటికీ.. కామాంధులు తమ ఆకృత్యాలు, ఘాతుకాలను ఆపట్లేదు. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశ హత్యపై యావత్ దేశం నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్న తరుణంలో.. మైనర్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు నలుగురు కిరాతకులు. వారిలో ఒకరు సీఆర్పీఎఫ్ జవాన్ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లా హాలియా పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఆర్పీఎఫ్ జవాన్ అరెస్టుతో బహిర్గతమైంది. బాధితురాలు పదో తరగతి విద్యార్థిని, హాలియా గ్రామానికి చెందిన బాధిత బాలికను సోమవారం రాత్రి 10 గంటల సమయంలో నలుగురు యువకులు అపహరించారు. పోలీస్ అనే స్టిక్కర్ అతికించిన వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని హాలియా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వారు చేతుల్లో కొన్ని గంటల పాటు ఆ బాలిక నరకాన్ని చవి చూసింది. అనంతరం స్పృహ కోల్పోయిన స్థితిలో ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో బాధిత బాలిక తల్లిదండ్రులు రాత్రంతా వెదికారు. మంగళవారం హాలియా గ్రామానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో కనిపించిందా బాలిక. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. బాధిత బాలిక తల్లిదండ్రులు హాలియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సీఆర్పీఎఫ్ జవాన్ మహేంద్ర కుమార్ యాదవ్, అతని స్నేహితులపై అనుమానాలను వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం మహేంద్ర కుమార్ యాదవ్ సహా ఈ దారుణానికి ఒడిగట్టిన లవ్ కుశ్ పాల్, జైప్రకాశ్ మౌర్య, గణేస్ ప్రసాద్ బిండ్ లను అరెస్టు చేశారు. ఈ నలుగురిలో జైప్రకాశ్ మౌర్య.. తండ్రి రిటైర్డ్ జైలు సూపరింటెండెంట్. ఈ నలుగురిని బుధవారం ఉదయం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మిర్జాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ ధరంవీర్ సింగ్ తెలిపారు.