పదేళ్లపాటు అత్యాచారం చేసి, ఇంటి నుంచి వెళ్లగొట్టాడు
బీదర్: ప్రేమ పేరుతో బాలిక పైన పదేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. ఈ సంఘటన కర్నాటకలోని బీదర్లో జరిగింది.
బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించాలని కూడా ఆదేశించింది. 2002లో బీదర్ జిల్లాలోని ఔరద్ పట్టణంలో మారుతి అమ్రెప్ప అనే వ్యక్తి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఎస్డీఎంసీ చైర్మన్ గా పని చేశాడు. ఆ సమయంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను అతను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు.
అప్పటికే అతనికి పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి, తాను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. పై చదువుల కోసమని ఆ బాలికను మంగళూరుకు పంపించాడు. అక్కడ ఓ ఇల్లు తీసుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
ఇద్దరు కలిసి జీవించారు. అమ్మాయి తొమ్మిదిసార్లు గర్భవతి కాగా ప్రతిసారి అబార్షన్ చేయించాడు. పదోసారి ఆమె బిడ్డకు జన్మను ఇచ్చింది. బిడ్డ పుట్టడం ఇష్టం లేని అతను అనాథశరణాలయానికి ఇచ్చాడు. 2012లో అమ్మాయి గర్భవతి కాగా అబార్షన్ చేయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె నిరాకరించడంతో గెంటేశాడు. బాధితురాలు కోర్టుకు ఎక్కింది. గురువారం నాడు కోర్టు తీర్పు చెప్పింది.